ప్రజల భాగస్వామ్యమే ఉత్తమ జర్నలిజానికి ప్రాతిపదిక

19/12/2011

(చెన్నైలోని తెలుగు జర్నలిస్టుల సంఘం TEJOUS దశాబ్ది సంచికలో ప్రచురితమైన వ్యాసం. ఆ సంచికలో కొన్ని పేరాలు ముందు, వెనక అచ్చవడంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఇక్కడ.. ఆ వ్యాసం అసలు ప్రతిని పోస్టు చేస్తున్నాను. జర్నలిస్టులు, మిత్రులు, జర్నలిస్టు మిత్రులు, బ్లాగ్హితులు ఈ వ్యాసంపై విలువైన అభిప్రాయాలు తెలుపుతారని ఆశిస్తాను.)

“You can trust in us for correcting our mistakes”

‘నిజమే చెబుతాం. అబద్ధం అస్సలు చెప్పం. మమ్మల్నే నమ్మండి’ వంటి ప్రకటనల కన్నా పైవాక్యం ఒక జర్నలిస్టుగా నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా, మూడేళ్ళ కిందట టెలివిజన్ జర్నలిజంలోకి వచ్చిన తరువాత ఆ వాక్యానికున్న ప్రాధాన్యం మరీ బాగా తెలిసివచ్చింది. ప్రింట్ జర్నలిజంలో పని చేసిన పదహారేళ్ళలో తప్పు చేయడం మహాపరాధమనే భావనే వెంటాడింది. జర్నలిస్ట్ తప్పు చేయకూడదు. ఏది రాసినా సరిగా నిర్థరించుకున్న తరువాతే రాయాలి. మన రాత రిజాయిండర్ కు దారితీసిందంటే తలకొట్టేసినంత పని.

టీవీ జర్నలిజంలోకి వచ్చిన తరువాత తప్పులు చేయడం తప్పనిసరి అనిపించింది. అది అనుభవం నేర్పిన పాఠం. మేగజైన్ జర్నలిజంతో పోల్చితే డైలీల్లో కూడా ఇలాంటి పాఠాలు మామూలైపోయాయి. ఊహాత్మక, వ్యూహాత్మక కథనాలు ఫ్రంటు పేజీల్లో చపాయిస్తున్న దుర్భర సందర్భంలో జర్నలిస్టులు వలువలొక్కక్కటే వదిలేస్తున్నారని చిర్రెత్తుకొస్తుంది. ఇలాంటి ఉద్దేశపూర్వక పాత్రికేయ వృత్తి ధర్మాల సంగతి అలా ఉంచితే, టీవీ జర్నలిజంలో ఎలాంటి దురుద్దేశాలు లేకున్నా కూడా తప్పుల్లో కాలేస్తుంటాం. ఎందుకంటే, తుదిగా తేలే నిజాన్ని కాకుండా.. నిజం కోసం చేసే ప్రయాణాన్ని కూడా న్యూస్ చానల్లో చూపించాల్సి ఉంటుంది. ప్రయాణమన్నాక ఒక్కోసారి దారితప్పవచ్చు.

అందుకే, ఆరేళ్ళ కిందట  అమెరికాలోని జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్ స్టీవెన్ వి. రాబర్ట్స్ ప్రస్తావించిన ఆ వాక్యం నాకు  మళ్ళీ మళ్ళీ గుర్తుకువస్తోంది. స్టీవ్ రాబర్ట్స్ 20 ఏళ్ళు న్యూయార్క్ టైమ్స్ లో పని చేశారు. ఆ తరువాత జర్నలిజం బోధన వైపు మళ్ళారు. జర్నలిస్టు కావడానికి లైసెన్స్ అక్కర్లేదు. ఆ మాటకొస్తే పత్రికలోనో, టీవీలోనో ఉద్యోగమూ అక్కర్లేదు. లైసెన్స్ లేని వృత్తిలో బాధ్యత ఎక్కువ. ఎవరూ అడిగేవారు లేరని తప్పులు చేస్తే, సరిదిద్దుకునే బాధ్యత జర్నలిస్టుదే. పత్రికలదే. చానళ్ళదే. అందుకే, విశ్వసనీయతకు మేమే కేరాఫ్ అడ్రస్ అని డోలు బజాయించుకునే బదులు, తప్పులు చేస్తే సరిదిద్దుకునే మా నిజాయితీని నమ్మండి అని చెప్పుకోవడం.. ఎథికల్ జర్నలిజాన్ని తలదాల్చడానికి ఇంకా ఆపసోపాలు పడుతున్న టీవీ జర్నలిజానికి చాలా అవసరం. ఏది నైతికం, ఏది అనైతికమనే శాస్త్ర మీమాంస, news script with emotional graph అనే సెన్సేషనల్ జోరులో, వెర్రిలో నవ్వుల పాలవుతోంది. టీవీ జర్నలిజానికి సంబంధించి భావాలు ఇంకా పాఠాలుగా మారలేదు. కాబట్టి, నేర్చుకోవడమన్నది పనిలో భాగంగానే కొనసాగుతోంది.

తెలుగు జర్నలిస్టుల సంఘం (తేజస్) దశాబ్ది సంచిక కోసం వ్యాసం రాయాలని మిత్రులు కోరినప్పుడు, ఆ సంస్థ  ఫౌండర్ జాయింట్ సెక్రటరీగా అది నా బాధ్యత అనిపించింది. దేనిపై రాయాలన్నప్పుడు, అమెరికాలో నెల రోజుల పాటు అక్కడి మీడియాతో జరిపిన ఇంటరాక్షన్స్ గురించి ఎక్కడా రాయలేదు కదా, ఆ విశేషాలు రాస్తే బాగుంటుందని ఆర్టిస్ట్-కార్టూనిస్ట్ నర్సిం చేసిన సూచన బాధ్యతను ఇష్టంగా మార్చింది. “Role of the Press for Vernacular Journalists” ప్రాజెక్టు కింద 2005 అక్టోబర్ లో అమెరికా విదేశాంగ శాఖ నాతో కలిపి అయిదుగురు తెలుగు జర్నలిస్టులను – కె. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి), ఎన్. రాహుల్ కుమార్ (ఈనాడు), ఎం. మురళీకృష్ణ (టివి9), ఐ. సురేశ్ (ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్) – ఆహ్వానించింది. వాషింగ్టన్ డి.సి, న్యూయార్క్ సహా అయిదు నగరాల్లోని మీడియా సంస్థలతో ప్రాంతీయ భాషల సమాచార మాధ్యమాల గురించి అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడం ఆ కార్యక్రమం ప్రధానోద్దేశం. ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్ షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా నిర్వహించిన ఆ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా ధోరణులను, మీడియా ఎదుర్కొంటున్న ఆందోళనలను అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడింది.

ధోరణులు, ఆందోళనలు చాలా వరకు అక్కడా ఇక్కడా ఒకే విధంగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాను చూస్తే మనకు రాబోయే సమస్యలేమిటో కూడా అర్థమవుతాయి. టీవీ, ఇంటర్నెట్ జనంలోకి వేగంగా చొచ్చుకుపోవడంతో పత్రికల సర్క్యులేషన్ పడిపోవడం ఒక సమస్య. విస్తరిస్తున్న టెలివిజన్ న్యూస్ రంగంలో వాస్తవాలపై వేగానిదే పైచేయి కావడం మరో సమస్య. చానళ్ళతో పోటీ, చానళ్ళ మధ్య పోటీ వల్ల “నిజమైన ప్రజలు” వార్తల్లో లేకుండా పోవడమన్నది అతి పెద్ద సమస్య. అత్యంత ప్రమాదకరమైన సమస్య. Who is ahead, not what do they say అన్నట్లుగా తయారైన horse race coverage లో ముందుండేందుకు న్యూస్ చానల్సే కాదు అచ్చు మాధ్యమం కూడా రెట్టించిన ఉత్సాహంతో పోటీ పడుతోంది. ఫ్రంట్ పేజీల్లో ఐటమ్ నంబర్స్ తో ఊదరగొడుతోంది. ఫలితంగా మన రాష్ట్రంలోని పెద్ద పత్రికలు, సర్క్యులేషన్ సమస్యల దశాబ్దాన్ని సులువుగానే దాటగలిగాయి. పైగా మనది మోస్ట్ హాపెనింగ్ స్టేటాయె!

అందుకే, సర్క్యులేషన్ పడిపోవడం, రీడర్షిప్ దిగజారడం, ప్రింట్ రంగంలో వేల ఉద్యోగాలు హుళక్కి అయిపోవడం వంటివి మనకు చాలావరకు నాన్-ఇష్యూస్. వార్తల్లో “అసలైన ప్రజలు” లేకుండాపోవడమే మనం ఎదుర్కొంటున్న ప్రధాన, ప్రమాదకర సమస్య. పెట్టుబడిదారి మీడియా ప్రజల నుంచి పాఠకుల్ని/ప్రేక్షకుల్ని సమర్థంగా వేరు చేయగలిగిందా? పెట్టుబడి లక్ష్యం రాబడి కాబట్టి వినియోగదారుల్ని గుర్తించడం, మచ్చిక చేసుకోవడం ఎలాగూ జరుగుతుంది. కానీ, పత్రిక లేదా చానలే పెట్టుబడి కావడం నేటి విపరీతం. ఇది 2జి స్పెక్ట్రమ్ స్కామ్ లు, ఎమార్ కుంభకోణాలు, ఔటర్ రింగురోడ్లు వార్తలు రాసుకోవడం లాంటిది.

మీడియా రీడర్షిప్/ వ్యూయర్షిప్ కోల్పోతుండడం, ప్రజాస్వామ్య వ్యవస్థ రాజకీయ, పౌర భాగస్వామ్యాన్ని కోల్పోతుండడం వర్తమాన సమాజపు కవల సమస్యలని నార్త్ కెరోలినా యూనివర్సిటీ జర్నలిజం అధ్యాపకులు డాక్టర్ ఫ్రాంక్ ఫీ చెప్పిన మాటలను మన రాష్ట్రంలోని మీడియా పరిణామాలు, ప్రమాణాలకు అన్వయించి చూస్తే చిత్రమైన లాజికల్ కంక్లూజన్స్ ఎదురవుతున్నాయి.

ఒకటి: రీడర్షిప్/వ్యూయర్షిప్  పడిపోతోంది, ప్రింట్ మీడియా ప్రమాదంలో పడిందని అనుకోవడం మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక సిగ్గుమాలిన పని. ఎందుకంటే, అవి పాఠక లేదా ప్రేక్షకాదరణపై మాత్రమే ఆధారపడి లేవు.

రెండు: రాజకీయ శక్తులు ప్రజాస్వామ్యంలో భాగస్వాములు అవకుండా, మీడియాస్వాములు కావడం (ప్రత్యక్షంగానో పరోక్షంగానో) వల్ల పాత్రికేయ విలువల గురించి మాట్లాడేవారు చాదస్తులనే ముద్రతో చరిత్ర పుటల్లో కలిసిపోతున్నారు.

మూడు: పీపుల్స్ అజెండా కాకుండా ఓనర్స్ (ఎడిటర్స్’ కాదు) అజెండాలు మీడియా సంస్థలపై రెపరెపలాడుతుంటే, ప్రజలు రెంటికి చెడ్డ రేవళ్ళయ్యారు. అంటే, ఇటు పత్రికల్లోనూ అటు ప్రజాస్వామ్యంలోనూ ప్రజల పాత్ర తగ్గిపోతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర బలంగా తెర ముందుకు వచ్చినప్పుడు కూడా ఆ భాగస్వామ్యం కనిపించని దుస్థితి. ఇది పత్రికల్లో ప్రజల భాగస్వామ్యరాహిత్యం వల్ల కలుగుతున్న అనర్థం.

నాలుగు: ప్రజాస్వామ్యం, పాలన, నిఘాలకు బదులు అధికారం, అవినీతి, ప్రచారాలే రాజ్యమేలుతున్నాయి.

మరి, పాలన ఎవరు చేస్తున్నారు? ఎవరూ చేయడం లేదు. ఇప్పుడు నడుస్తున్నది పీపుల్స్ మేనేజ్ మెంట్ యుగం. జనాన్ని ఎంత బాగా మేనేజ్ చేస్తే అంత అధికారం, అంత సంపద. ఈ అజమాయిషీ కళను ప్రదర్శించే తాహతు సంపద పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది. ఎంత తాహతు ఉంటే అరిచేతిలో అంత మీడియా! లేకుంటే, శ్రీకృష్ణ కమిటీ తన అష్టమ అధ్యాయంలో స్ట్రింగర్ల నుంచి ఎడిటర్ల దాకా చేయాల్సిన మీడియా మేనేజ్ మెంట్ గురించి అంత నిస్సిగ్గుగా ఎలా రాయగలుగుతుంది?

మీడియాకు ప్రజల అజెండా లేనప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యాన్ని ”కనిపించనీయకుండా” చేసే కుయుక్తులు ఫలిస్తాయి. అయితే, రెక్కవిప్పుకున్న ప్రాంతీయ, కుల ఉద్యమాలు, అవినీతి వ్యతిరేక పోరాటాలు ఆ ఫలితాలు తాత్కాలికమేనని గుర్తు చేస్తున్నాయి. ఆశకు శ్వాసనిస్తున్నాయి.

మీడియాలో వస్తున్న అవాంఛనీయ ధోరణులను కట్టడి చేసి, దిద్దుబాటు సూచనలు చేసే సంస్థలు అమెరికాలో బలంగా ముందుకు రావడం గత దశాబ్దపు కీలక పరిణామం. ఉదాహరణకు, న్యూయార్క్ లో Fairness and Accuracy in Reporting (FAIR) అనే లాభాపేక్ష లేని సంస్థనే తీసుకుందాం. అమెరికాలోని ఈ ఏకైక వామపక్ష మీడియా నిఘా సంస్థ మీడియాలో వచ్చే వార్తలకు, ప్రజల మనోగతానికి మధ్య ఉన్న తేడాను వివరించేందుకు కృషి చేస్తుంది. ఇరాక్ మీద యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికన్ మీడియాలో 71 శాతం వార్తలు యుద్ధానికి అనుకూలంగా వచ్చాయి. యుద్ధ వ్యతిరేక వార్తలకు లభించిన చోటు కేవలం 3 శాతమే. కానీ, ప్రజల మనోభావాలు పత్రికల రాతలకు భిన్నంగా మారుతూ వచ్చాయి. యుద్ధం ముగిసే సమయానికి 59 శాతం అమెరికన్లు ఇరాక్ నుంచి సేనల ఉపసంహరణ జరగాలని కోరుకున్నారు. 60 శాతం మంది ప్రజలు యుద్ధం ఒక ఘోర తప్పిదమనే అభిప్రాయంతో ఉన్నారు. కేవలం 8 మందితో పని చేసే ఈ సంస్థ ప్రజల మనోగతాన్ని సర్వేక్షిస్తూ మీడియాను గైడ్ చేస్తుంది. సామ్రాజ్యవాద ధోరణి అమెరికన్ మీడియాను ప్రభావితం చేస్తుంది, న్యూయార్క్ టైమ్స్ పత్రిక అమెరికా ఇమేజ్ కు సంరక్షకుడిననే భావనతో పని చేస్తుందని FAIRలోని సీనియర్ విశ్లేషకుడు స్టీవ్ రాండల్ అన్నారు.

ఫ్రీడమ్ ఫోరమ్ అనే మరో స్వచ్ఛంద సంస్థ వర్జీనియాలో ఉంది. ఈ సంస్థ పని కూడా మీడియాను ట్రాక్ చేయడమే. అమెరికాలో మీడియా లిబరల్, కన్సర్వేటివ్ కూటములుగా విడిపోయిందని ఆ సంస్థ ఒక జాబితానే చూపించింది. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటివి లిబరల్ వాదాన్ని ప్రచారం చేస్తుంటే కన్సర్వేటవ్ మౌత్ పీస్ లుగా ఫాక్స్ న్యూస్ వంటివి పని చేస్తున్నాయి. పెడ ధోరణులను గుర్తించి చూపించడమే కాకుండా, మీడియాలో వస్తున్న మార్పుల మీద సశాస్త్రీయ నివేదికలు తయారు చేస్తున్నాయి ఇలాంటి సంస్థలు. 13,000 రేడియో స్టేషన్లు, 1700 టీవీలు ఉన్న అమెరికాలో పత్రికల సర్క్యులేషన్ మొత్తంగా 5.53 కోట్లు. యాభయ్యేళ్ళ కిందట అంటే 1960లో ఆ సంఖ్య 5.89 కోట్లు. అందుకే, ప్రింట్ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న ఆందోళనకు గురి చేస్తోంది. అదే సమయంలో ఇంటర్నెట్ యూజర్స్ సంఖ్య 20 కోట్లకు చేరుకుంది. జనాభాలో 68 శాతం మంది ఇంటర్నెటిజన్సే. కోటిన్నర లక్షల శ్రోతలను సంపాదించడానికి అమెరికన్ రేడియోకు 40 ఏళ్ళు పట్టింది. అదే కోటిన్నర ప్రేక్షకుల్ని సంపాదించడానికి టీవీకి పట్టిన సమయం కేవలం 13 ఏళ్ళు. సమాన సంఖ్యలో యూజర్స్ ను గెల్చుకోవడానికి ఇంటర్నెట్ కు నాలుగేళ్ళు సరిపోయాయి. ఆ తరువాత పదేళ్ళలో 20 కోట్ల మంది నెట్ లో మునిగితేలుతున్నారు. ఇలాంటి డేటాను సిద్ధం చేయడమే కాకుండా సెమినార్లతో భవిష్య కార్యాచరణను రచించే బాధ్యతను కూడా ఫ్రీడమ్ ఫోరమ్ నిర్వర్తిస్తుంది. పత్రికా పాఠకుల సంఖ్య పెరగడం మాని తగ్గుముఖం పడుతున్న కష్ట కాలంలో స్థానిక వార్తలు (local content) అచ్చు మాధ్యమానికి కొత్త ఊపిరినిస్తున్నాయి. అమెరికాలోని 85 శాతం వార్తా పత్రికలు 50,000 కన్నా తక్కువ సర్క్యులేషన్ కలిగినవేని ఫ్రీడమ్ ఫోరమ్ కన్సల్టెంట్ జీన్ మేటర్ చెప్పారు. పడిపోతున్న సర్క్యులేషన్ సమస్యను  ఎదుర్కోవడానికి న్యూస్ పేపర్ సంస్థలను కాకుండా సమాచార సంస్థలను నడపాలనే సూచన అమెరికన్ మీడియానే కాదు మన తెలుగు మీడియాను కూడా పదేళ్ళ కిందటే మేల్కొల్పింది.

నార్త్ కెరోలినా రాష్ట్ర రాజధాని ర్వాలీ నగరంలో పని చేస్తున్న సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ జర్నలిస్ట్స్ (SPJ) కూడా ఇలాంటిదే. నిజాన్ని చెప్పినందుకు సమస్యల పాలైన జర్నలిస్టులకు ఈ సంస్థ అండగా నిలుస్తుంది. అంతేకాదు, నైతిక విలువలు లేని జర్నలిస్టుల పేర్లతో బ్లాక్ లిస్ట్ కూడా తయారు చేస్తుంది. ఇలాంటి సంస్థలన్నీ సభ్యత్య రుసుముతో పని చేస్తున్నాయి. ఎస్.పి.జేలో సభ్యత్వ రుసుము ఏడాదికి 80 డాలర్లు. అందులోని సభ్యుల సంఖ్య 10 వేలకు పైమాటే. పబ్లిక్ ఎడిటర్ లేదా ఓంబుడ్స్ మన్ లను నియమించుకోవడం ఒక పక్క జరుగుతూనే ఉంది. మరో వంక మీడియా విలువల మీద నిఘా వేసే సంస్థలూ పని చేస్తున్నాయి. మన దగ్గర కూడా ఇలాంటి ఫోరమ్ లు రావాల్సిన అవసరం చాలా ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థల వల్ల ఎంతో కొంత పని జరిగితే జరిగి ఉండవచ్చు. కానీ, పర్యవేక్షణ కోణంలో వాటి కృషి అంతంత మాత్రం. రాష్ట్రంలో 2009 ఎన్నికల సందర్భంగా పెయిడ్ న్యూస్ పేరుతో పత్రికలు కోట్లకు కోట్లు నొక్కేసిన వైనం మీద భారత ప్రెస్ కౌన్సిల్ నియమించిన ఇద్దరు సభ్యుల (కె. శ్రీనివాసరెడ్డి, పరంజయ్ గుహ ఠాకూర్తా) సబ్ కమిటీ ఇచ్చిన 71 పేజీల నివేదికను తొక్కి పట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు జరిగాయో తెలిసిందే. “Publishers’ Interests” కోసే ప్రెస్ కౌన్సిలే ప్రెస్ సెన్సార్ షిప్ కు పాల్పడేందుకు సిద్ధపడింది. “Payper” Culture అంటూ హిందూ పత్రికలో రాసిన ఎడిట్ పేజి వ్యాసంలో సీనియర్ జర్నలిస్ట్ పి. సాయినాథ్, “అలాంటి చారిత్రక తప్పిదానికి ప్రెస్ కౌన్సిల్ పాల్పడకూడదని ఘాటుగా హెచ్చరించిన సంగతి కూడా మనకు తెలుసు. Paid News Syndrome ఎలక్ట్రానిక్ మీడియాకూ విస్తరించింది. పెయిడ్ న్యూసే కాదు మీడియాను ప్రలోభపెట్టే మార్గాలు ఇంకా చాలానే ఉన్నాయి.

ఇలాంటి ధోరణుల మధ్య మన మీడియా ఆత్మావలోకనం చేసుకోవాలి. వాటర్ గేట్ కుంభకోణం వెలుగు చూసిన ఉదంతం అమెరికాలో ఒక తరాన్ని జర్నలిస్టులు కావడానికి ప్రేరేపించింది. ఇటీవలి కాలంలో మన రాష్ట్రంలో దళిత, స్త్రీవాద, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు యువతను జర్నలిజం వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నాయి. వరదలు, ప్రకృతి బీభత్సాలు సంభవించినప్పుడు మీడియా ద్వారా మంచి చేయవచ్చనే ఆలోచన నవతరానికి కలుగుతోంది. ఇక భావజాలవ్యాప్తి ప్రభావం ఎంత ఉద్ధృతంగా ఉంటుందో తెలంగాణ ఉద్యమం చాటి చెప్పింది. మెదళ్ళలో రగులుతున్న భావాలు ఉన్న వారు సహజంగానే జర్నలిజం పట్ల ఆకర్షితులవుతారు. పైగా, టీవీ న్యూస్ తో జర్నలిజానికి గ్లామర్ పెరిగింది. ఈ దశలో మార్గదర్శకత్వం వహించే వ్యవస్థల నిర్మాణం జరగాలి. జర్నలిస్టు సొసైటీలు ఇళ్ళ స్థలాల కోసం కాకుండా చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని జనానికి, జర్నలిస్టులకు తెలియాలి.

చివరగా, ప్రస్తుతం వృత్తిలో కొనసాగుతున్న మనలాంటి జర్నలిస్టులు ఈ దిశగా ఏం చేయాలి? “రోల్ ఆఫ్ ది ప్రెస్ ఫర్ వెర్నాక్యులర్ జర్నలిస్ట్స్” పేరుతో నెలరోజుల పాటు అయిదు నగరాల్లో జరిగిన ఈ ప్రోగ్రామ్ లో అక్కడి సీనియర్ జర్నలిస్టులతో జరిపిన సంభాషణలో నాకు నచ్చిన విషయాలు ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తాయని ఆశిస్తాను.

-      వార్త అంటే కేవలం వాస్తవాలేనా? వాస్తవాలను యథాతథంగా నివేదించడం వల్ల “సత్యం” తెలుస్తుందా? అందుకే, వార్తను భిన్న కోణాల నుంచి నివేదించాలి.

-      ప్రతి వార్తా కథనానికి, దానికి సంబంధించిన జన సామాన్యం ఒకటుంటుంది. కథనంతో సంబంధం ఉన్న ప్రజలతో మాట్లాడాలి.

-      పాత్రికేయుడు ఒక కార్పొరేట్ ఉద్యోగిలాగా ప్రజా జీవితం నుంచి బయటకు రాకూడదు. నిత్యజీవితంలో సగటు, సామాన్య ప్రజలతో సంబంధాలు లేని వాడికి సమాజం పట్ల కన్సర్న్ ఉండదు.

-      సమస్య దొరగ్గానే పండగ చేసుకోవద్దు. మీడియాలో పరిష్కారాలను సెలబ్రేట్ చేయాలి.

-      సంబంధిత రంగాల నిపుణుల మద్దతు తీసుకోవాలి.

-      ముఖ్యంగా, ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను బాధ్యులను చేసి ప్రశ్నించడంలో సామాన్య ప్రజలకు సహకారం అందించాలి.

వ్యక్తి నిర్వర్తించదగిన ఈ బాధ్యతలతో పాటు మనం ఒక సమాజంగా జర్నలిజాన్ని బోధించే సంస్థలను పెంచాలి. వాటిల్లో వయసుతో నిమిత్తం లేకుండా విద్యార్థులను చేర్చుకోవాలి. పాజిటివ్-ప్రాక్టికల్ జర్నలిజం పాఠ్యాంశాలను సమకాలీన పరిణామాలతో సమన్వయిస్తూ రూపొందించాలి. మల్టిపుల్ వేస్ ఆఫ్ జర్నలిజం బోధిస్తున్నన్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీ జర్నలిజం కళాశాలలో ఇంజనీర్లు, డాక్టర్లు, ఇంకా ఇతర వృత్తి నిపుణులు విద్యార్థులుగా ఉన్నారు. “అంతేకాదు, నాకు ఒక 66 ఏళ్ళ విద్యార్థి కూడా ఉన్నారు” అని ఆ కళాశాల డీన్ శ్రీనాథ్ శ్రీనివాసన్ అన్నారు. ఎన్. రామ్, బర్ఖా దత్, ఇందర్జీత్ బధ్వార్ వంటి ప్రముఖ జర్నలిస్టులెందరో కొలంబియా జర్నలిజం కాలేజిలో చదువుకున్నారు.

జర్నలిజానికి విశ్వసనీయతే ఆయువు. అందుకే, స్వచ్ఛంద పర్యవేక్షణ సంస్థల రూపంలో స్వీయ రక్షణ కవచాన్ని మనమే నిర్మించుకోవాలి. జర్నలిజం బోధనను విస్తరించాలి. ఆ దిశగా తేజస్ కూడా కృషి చేయడం నాకు ప్రత్యక్షంగా తెలుసు. జర్నలిజం విద్య వ్యాప్తి చెందడం వల్ల అందరూ జర్నలిస్టులు అయిపోతారా? కానక్కర్లేదు. కానీ, people will be their own editors అన్న వాక్యం నిజమౌతుంది. అప్పుడు, You can trust in us for correcting our mistakes” అని ప్రతి మీడియా పౌరుడూ చెప్పుకోకతప్పదు.

—–

టీవీ న్యూస్ చానళ్ళపై కొలవెరి

12/12/2011

టీవీ చానళ్లు ముఖ్యంగా తెలుగు వార్తా చానళ్ళ మీద కొలవెరి బాణీలో యూట్యూబ్ లో ప్రత్యక్షమైన పాట:

CNN-IBN Debate on Telangana

29/09/2011
It is so sad that national channel like CNN-IBN conducts a debate on Telangana with focus on Brand Hyderabad and the anchor Sagarika tried to blame the politicians fromTelagana for not trying to keep the temperatures down in the region. I wonder,how she can ignore the fact that the people of the region fighting for their demand peacefully for more than 10 years and central government ruthless silence after the submission of Srikrishna committee report. Instead, she preferred to refer false reports like agitators attacking Emaar. First, the question she raised was completely from capitalist’s point of view. Second, she is arrogant enough to close her eyes to facts such as people from all walks of life on streets for the last two weeks. No, it is not journalism for people. Being indifferent to the sacrifices by the people and concerned about Brand Hyderabad is ridiculous. Brand Hyderabad, as Sanjay Baru said, will survive for ever. Because, it was brand even before independence. Now, give thought to aspirations of the people, identify with their sentiments. It is national media’s responsibility to understand the gravity of the issue and react accordingly. Telangana is a serious issue not a fancy one like fight against corruption to grab TRPs nationwide. National media has to take the cognizance of the issue to the people across the country to keep the federal spirit of the largest democracy alive.
Here is the link to the show:
http://www.youtube.com/watch?v=eJC3FJw9E4Q
***

తెలంగాణ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగానే ఉందని కేసీఆర్ కు ఎవరు చెప్పారు?

29/09/2011
ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సందర్భంలో, తెలంగాణ ప్రజలకు హామీ లభించాల్సింది కేంద్రం నుంచి మాత్రమే. ఉద్యమ సారథులు లేదా ఉద్యమ పార్టీ నేతలు ఇచ్చే అలాంటి హామీలకు విలువ లేదు. గతంలో ఎన్నోసార్లు తెలంగాణ ప్రాంత నాయకులు ఢిల్లీ పెద్దల మనసు తమకు తెలిసిపోయినట్లు మీడియా మైకుల ముందు మాట్లాడారు. ఢిల్లీకి వెళ్ళి సోనియా, అహ్మద్ పటేల్, ఆజాద్ తదితరులతో చర్చలు జరిపి బయటకు వచ్చాక, కేంద్రం తెలంగాణ డిమాండ్ పట్ల సానుకూలంగా ఉందని వారు నమ్మబలికే ప్రయత్నాలు చేశారు. కానీ, ఢిల్లీ పెద్దల్లో ఏ ఒక్కరు కూడా తెలంగాణ నేతలతో మాట్లాడిన తరువాత తమ వైఖరిని స్వయంగా ప్రకటించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. సకల జనుల సమ్మెతో ప్రజలంతా కష్టాలకోర్చి ఉద్యమాన్ని మలిదశకు నడిపిస్తున్న సందర్భంలో నాయకత్వం ఎంతో అప్రమత్తంగా ఉండాలి.

“ డెఫినెట్ గా తెలంగాణ వస్తది. కేంద్రం తెలంగాణ ఇవ్వడానికే సిద్ధమైంది. తెలంగాణపై త్వరలో నిర్ణయం. కర్నూలు, అనంతపురం జిల్లాలతో కలిపి తెలంగాణను ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం యోచిస్తోంది” అంటూ టీఆరెస్ అధినేత కేసీఆర్ ఈరోజు చేసిన వ్యాఖ్యల వల్ల ఉపయోగం ఏమిటి? ఆయన నిజం చెబుతున్నారా? జోస్యం చెబుతున్నారా? నిజమైతే అంతకన్నా కావాల్సింది మరొకటి లేదు. కానీ, ఆయన చెబుతున్నది జోస్యమైతే దానివల్ల ఉద్యమానికి నష్టమే తప్ప లాభం లేదు. ఉన్నత నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు అలా మాట్లాడడం వల్ల ఉద్యమం మీద నీళ్ళు చల్లినట్లవుతుంది. అది నమ్మకాన్ని వ్యక్తం చేయడం కిందకే రావచ్చు. అయనా సరే, అలాంటి ప్రకటనల వల్ల పరుగు తీస్తున్న వాడి చూపు పక్కకు తిరిగే ప్రమాదం ఉంది.

రెండు నెలల కిందట అంటే సరిగ్గా జూలై 14న తెలంగాణ కాంగ్రెస్ నేతల 48 గంటల ధర్నాకు సంఘీభావం తెలుపుతూ,  అదే వేదిక మీద ఇదే కేసీఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకుని, “మరో రెండు వారాల్లో తెలంగాణ ప్రకటన వెలువడుతుంది” అని ప్రకటించారు. అలా అని ఢిల్లీ నుంచి తనకు సమాచారం వచ్చిందని కూడా చెప్పారు. రెండు నెలలు గడిచిపోయాయి. ఏమీ జరగలేదు. ప్రజలే వందలు, వేలు, లక్షలై సమ్మె బాట పట్టాల్సి వచ్చింది. లక్ష్యాన్ని స్వప్నిస్తూ, కష్టాలను సహిస్తూ సకల జనుల సమ్మెతో చరిత్రను కొత్త నిర్వచిస్తూ ఉద్యమిస్తున్నారు.
ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ కేంద్రం తెలంగాణ ఇవ్వడానికే సిద్ధమైనట్లు తన వద్ద సమాచారం ఉందంటున్నారు. అది నిజమే అయితే పెరుగుతున్న పోలీసుల అరాచకాలకు అర్థం ఏమిటి? ఈ (28 సెప్టెంబర్) ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏం మాట్లాడి ఉంటారు? ఏది ఏమైనా, తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సింది కేంద్రమే. తెలంగాణ ఇవ్వడానికి కేంద్రం సిద్ధమైందో లేదో అన్నది కేంద్రమే చెప్పాలి. మనకు జోస్యాలతో పని లేదు. తెలంగాణ ప్రజ ఇప్పుడు అమాయకంగా అద్దంలో చందమామ కోసం పోరాడడం లేదు. దశాబ్దాల కలను నిజం చేసే అధికారిక ప్రకటన కోసం శాంతియుతంగా పోరాడుతోంది. అందుకోసం, ఉద్యమ నాయకత్వం “ప్రజలతో మాట్లాడడం” కాకుండా, “ప్రజల వైపు నుంచి మాట్లాడడమే” కొనసాగించాలి. అంతవరకూ, కేసీఆరే అన్నట్లు, “ఏం చేసినా తెలంగాణ ఆగదు. ఇప్పుడు తెలంగాణ రాకపోతే పాతాళానికి తొక్కుతరు.”

***

ఎన్.వి.పి లా కళాశాల పూర్వ విద్యార్థుల (1986-92) సమావేశం – ఒక పునరుత్తేజం

24/05/2011
.
గతం గతిస్తుందా? చిన్నప్పటి అమ్మ చేతి గోరు ముద్దల రుచి లీలగా మదిలో మెదులుతూనే ఉన్నప్పుడు, బండ రాతి కొండలపైకి ఎక్కి మగ్గిన సీతాఫలాలను తెంపుకుని మిత్రులతో కలిసి పంచుకున్న జ్ఞాపకం మూసిన రెప్పల తెరపై స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, సిటీ బస్సుల ఫుట్ బోర్డుల మీద వేలాడుతూ కాలేజీకి వెళ్ళినప్పుడు భుజాలు లాగిన తీపి బాధ ఇంకా అక్కడే సద్దుమణగకుండా గొణుగుతున్నప్పుడు, స్నేహితుల భుజాల మీద చేతులు వేసినప్పుడు రుచి తెలిసిన అభిమాన స్పర్శ ఇంకా అరిచేతుల్లో వెచ్చగా విచ్చుకుంటూనే ఉన్నప్పుడు. తోటి విద్యార్థినుల వాలు చూపుల క్రీనీడల్లో జ్ఞాపకాలు వూయలూగుతూనే ఉన్నప్పుడు.. జడ కుచ్చుల లోలకాల నడుమ కాలం వేలాడిన వైనం.. కళ్ళల్లో సెకనుకు ఇరవై నాలుగు ఫ్రేములుగా పరిభ్రమిస్తూన్నప్పుడు.. క్లాసులు, కలహాలు, పరీక్షలు, ప్రణయాలు, ఫలితాలు, నవ్వులు, కన్నీళ్ళు కలగలసిన తోటలో.. దేహం విహరిస్తూనే ఉన్నప్పుడు.. గతం గతిస్తుందా?
.
గతం గతించదు. గతం, వర్తమానం, భవిష్యత్తులు ఒకే సరళ రేఖ మీద ఉంటాయి. మనమే ఇష్టం వచ్చినట్లు అటూ ఇటూ తిరుగుతాం. ఒక్కోసారి ఈ సరళ రేఖ వృత్తంగా మారుతుంది. కాలంలో గత,వర్తమాన, భవిష్యత్తులనే విభజన రేఖలు గల్లంతవుతాయి. మనం మన జీవితంలోనే చుట్టూ తిరుగుతాం.
ఈ నెల 21, 22 తేదీల్లో నా జీవితంలో గతం వర్తమానమైంది. వృత్త భ్రమణంలో మనసంతా మురిసిపోయింది. విశాఖపట్నంలోని న్యాయ విద్యాపరిషత్ (ఎన్.వి.పి) లా కళాశాలలో మొదటి అయిదు సంవత్సరాల లా కోర్సు విద్యార్థులమంతా ఆరోజు మళ్ళీ కలుసుకున్నాం. మేమంతా ఎన్.వి.పి లా కాలేజి తరగతి గదిలో కలుసుకుని ఇప్పటికి అక్షరాలా పాతికేళ్ళు. 1986 చివరలో ఈ రాష్ట్రంలో తొలి ఫైవ్ ఇయర్ లా కోర్సు ప్రారంభమైంది. అప్పుడు మొదటిసారిగా ఆ కోర్సును ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోనే ప్రారంభించారు. లాసెట్ మొదలైంది కూడా మా బ్యాచ్ తోనే. లాసెట్ లో క్వాలిఫై అయి ఎన్.వి.పి లా కళాశాలలో మొత్తం 72 మంది విద్యార్థులు చేరారు. మా కోర్సు 1986 చివర్లో మొదలై 1992 ఫిబ్రవరితో ముగిసింది. మార్చిలో ఫలితాలు వచ్చాయి. అంటే, మేం విడిపోయి దాదాపు ఇరవయ్యేళ్ళు కావస్తోంది. ఆ 72 మందిలో యాభైకి పైగా క్లాస్ మేట్స్ మే నెల 21, 22న జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరయ్యారు. వారిలో చాలా మంది లాయర్లుగా స్థిరపడ్డారు. కొందరు జి.పిలు, ఎజిపిలు అయ్యారు. ఒకరిద్దరు మెజిస్ట్రేట్లు అయ్యారు. మిత్రుడు కె.ఎస్.ఎన్ రాజు చోడవరం నుంచి టి.డి.పి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నారు. ఫర్వాలేదు, దాదాపు అందరూ, అతి కొద్ది మంది మినహాయిస్తే, జీవితంలో చెప్పుకోదగ్గ స్థాయికి ఎదిగారు. నేనొక్కడ్నే మీడియాలో ఉన్నాను.
అయిదేళ్ళు కలిసి చదువుకున్నప్పటికీ, 19 ఏళ్ళ గ్యాప్ తరువాత చాలా మందిని గుర్తుపెట్టుకోలేకపోయాను. జీవితం ముందుకు వెళ్తున్న కొద్దీ కొన్ని జ్ఞాపకాలు అన్ యూజ్డ్ డేటా లాగా ఎలా ఇరేజ్ అయిపోతాయో కదా అనిపించింది. ఈ ఆలమ్నీ మీట్ ఆ ఫైల్స్ అన్నింటినీ ఒక్కసారి రెట్రీవ్ చేసింది.
అలా మైండ్ రివైండ్ అవుతున్న కొద్దీ అనుభవించిన ఉద్వేగం అంతా ఇంతా కాదు. ప్రతి ఆలింగనంలో ఒక జ్ఞాపకం కొత్తగా వూపిరి పోసుకుంది. కరగని ప్రతి కన్నీటి చుక్కా మిత్రుల కళ్ళలోంచి జాలువారిన ఆత్మీయతను అతి జాగ్రత్తగా భద్రపరిచింది. ఇప్పుడు, నాలో జ్ఞాపకమై ఒదిగిన ప్రతి కన్నీటి బిందువూ ఓ ప్రిజమ్. సహచరులు గుర్తుకు వచ్చే క్షణాలే కిరణాలు. జ్ఞాపకాల పరిమళమే సప్తవర్ణాలు.
.

From Left: Rammohan, KSN Raju, Sreedhar, Reddy

హ్యాట్సాఫ్ టు రామ్ మోహన్ మై డియర్ క్లాస్ మేట్… నువ్వెంత శ్రమ తీసుకుంటే ఇంతమందిమి ఇలా తగరపువలసలోని హయగ్రీవ రిసార్ట్స్ లో కలిశాం! లాలో మాస్టర్స్ చేసి ఆ తరువాత డాక్టరేట్ పట్టా అందుకున్న రామ్మోహన్ అప్పటి మా క్లాసులోని 72 మంది విద్యార్థుల జాబితాను తీసుకుని ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్ సేకరించి.. ఈ సమాగమాన్ని సాధ్యం చేశారు. ఎమ్మెల్యే రాజు ఈ కృషికి అండగా నిలిచారు. హైదరాబాద్ నుంచి నేను, మెదక్ నుంచి రవిందర్, సిద్దిపేట నుంచి జీవన్ రెడ్డి కలిసి ఇన్నోవాలో విశాఖకు పయనమయ్యాం. ఆరోజు మాకు ఆ ఇన్నోవా ఒక టైమ్ మెషీన్. పని ఒత్తిడిలో పడి ఒకవేళ అక్కడికి వెళ్ళకపోయి ఉంటే.. అన్న ప్రశ్నే ఇప్పుడు భయంకరంగా కనిపిస్తోంది. ఎంత సంతోషం, ఎంత ఆనందం, పాత క్లాస్ మేట్స్ తో కలిసి పాత జ్ఞాపకాల్లోకి ప్రయాణించడం ఎంత అద్భుతమైన ఫీలింగ్? చదువుకుంటున్నప్పుడు ఎదురైన భేషజాలు, కోపాలు, తాపాలు.. అన్నీ మరిచి.. ఎన్ని చేసినా, ఏం చేసినా మనం చివరకు మనుషులమే కదా.. అన్న సత్యాన్ని గుర్తు చేసే సందర్భం ఎంత గొప్పది. మిత్రులారా.. మీతో గడిపిన ఈ క్షణాలన్నింటినీ పదిలంగా దాచుకుని మళ్ళీ మా వూరొచ్చాను. కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో, ఇంకా చెప్పాలంటే కొత్త జీవంతో.. మనం మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ఈ జీవనయానంలో కొంత వెనుకబడిన సహాధ్యాయులకు చేయూతనిచ్చేందుకు మనం ఏర్పాటు చేయాలని నిశ్చయించిన ట్రస్తును నిలబెడదాం. స్నేహం గొప్పదనాన్ని చాటి చెబుదాం.
***

మా ఇంట్లో అంతరిక్షం!

10/03/2011
.
మా ఇంట్లో ఈ మధ్యే అంతరిక్షాన్ని ఆవిష్కరించాం
అక్షరమక్షరం తడిమి తడిమి తెలుసుకుంటున్నాం
మా చూపుడు వేళ్ళ మీద నక్షత్రాలు వెలుగుతున్నాయి
మా కను రెప్పల వెంట్రుకలకు నెలవంకలు వేలాడుతున్నాయి
నేనూ మా ఆవిడా కలసి కొత్త ఖగోళాన్ని పోటీ పడి ఒళ్ళోకి తీసుకుంటున్నాం
మేమంతా ఉపగ్రహాలమై కొత్త చందమామ చుట్టూ పరిభ్రమిస్తున్నాం
ప్రతి క్షణం ఉదయిస్తున్నాం… చీకటిని వెలిగిస్తున్నాం…
కొత్త రుతువులమై పరిమళిస్తున్నాం..
.
…………………..
…………………………….

ముళ్ళపూడి, మిక్కిలినేని… ఒక రచయిత, ఒక పాత్ర!

25/02/2011
.
ముళ్ళపూడి వెంకటరమణకు ఎనభయ్యేళ్ళేమిటి? ఆయన నవయౌవనుడు అంటారు ఆత్మీయులు. కానీ, ఆత్మకు దేహంతో రుణం తీరిపోయే ఘడియ రాకమానదు. ఆ క్షణం వస్తేనేం? ముళ్ళపూడి మన మధ్యే ఉంటాడు నిత్వయౌవనుడిగా. ఇక, ఆయనను రెండోసారి మన నుంచి దూరం చేసే శక్తి ఏ శక్తికీ లేదు. బాపూరమణల ద్వంద్వ సమాసానికి వచ్చిన ఇబ్బంది అంతకన్నా లేదు. బాపూరమణీయం కాలాన్ని జయించి చాలా కాలమే అయింది. ముళ్ళపూడి సాహిత్యంలో సంప్రదాయ వాసనలు.. తెలుగుదనం వంటి పడిగట్టు పదాల సంగతి ఎలా ఉన్నా.. ఆయన మధ్య తరగతి జీవితంలోంచి పాత్రలను చిత్రించిన తీరు అద్భుతం. ఆయన కథానాయకుడు నేల విడిచి సాముగరిడీలు ఎన్నడూ చేయలేదు. సినిమాల్లో కూడా. ఆరోగ్యకరమైన హాస్యం, ఇంకా చెప్పాలంటే మర్యాదపూర్వకమైన హాస్యం.. ఆ నవ్వుల మాటున ఆర్ద్రంగా స్పృశించే కరుణ రసం ముళ్ళపూడి వెంకటరమణ సాహిత్యాన్ని చిరస్మరణీయం చేసింది. మనసుకు తగిన గాయాలను కూడా అందమైన అధిక్షేపణగా బంధించే విద్య తెలిసిన ముళ్లపూడి.. బాధను చమత్కారంగా మార్చడం కొత్తగా కోతికొమ్మచ్చి చదివినవారికి కూడా బాగా తెలుసు. బాపు, రమణలు పక్కపక్కనే కూర్చుంటే.. వారితో మాట్లాడ్డం ఒక మరిచిపోలేని అనుభవం. సంభాషణలోనూ అల్లరితనం.. క్షణక్షణం వినిపిస్తుంది. జర్నలిస్టులు బాపు గారి బైట్ కోరితే.. రమణ గారివ్వడం చాలా మామూలు. రమణ గారి మాటనే నా మాటగా తీసుకోండి అని ఆయన తరచూ చెప్పేవారు. ఓసారి బాపు గారి వద్దకు వెళ్ళి రమణగారు ఎక్కడున్నారని అడిగితే, “ఇన్నాళ్ళూ నా పక్కనే తోడుగా ఉన్నారు. ఇప్పుడు ఆయనను నా తలపై పెట్టుకున్నాను” అని మేడపైన గది చూపించారు నవ్వుతూ. అమ్మ లాంటి రమణ అని చెప్పుకున్న బాపు నిజంగానే ఆయనను తలపైన పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇరు దేహాలలోని సగం ఆత్మ ఎక్కడికని వెళ్తుంది? మిగిలిన సగంలోనే కదా కలుస్తుంది. అందుకే, బాపులో రమణ కనిపిస్తాడు. బాపు రేఖల్లో, చిత్రాల్లో వినిపిస్తూనే ఉంటాడు. పాత్రికేయునిగా, కథకునిగా, స్క్రైబ్ గా, సినీ సంభాషణల రచయితగా, నిర్మాతగా బహుముఖంగా రాణించిన ముళ్ళపూడి వెంకటరమణ.. మూగమనసు బాసలు తెలిపేందుకు మళ్ళీ తప్పకుండా వస్తారు.
.
ఒకే వారంలో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిని, ముళ్ళపూడి వెంకట రమణ వంటి ఉద్ధండులను కోల్పోవడం తెలుగు జాతికి తీరని లోటే. నాటక రంగానికి మిక్కిలినేని చేసిన సేవ చిరస్మరణీయం. సామాజిక, కళా చైతన్యంతో ఎదిగిన మిక్కిలినేని భీముడంటే భీముడే.. యమధర్మరాజు అంటే యమ ధర్మరాజే. స్వతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్న ఈ రాజకీయ చైతన్యశీలి.. తన 95 ఏళ్ళ జీవితంలో 80 ఏళ్ళు కళామతల్లి సేవలోనే గడిపారు. లభించిన పేరు ప్రతిష్ఠలకన్నా ఉన్నతమైన జీవితాన్ని గడిపిన మిక్కిలినేని గురించి అత్తలూరి విజయలక్ష్మి గారు ఆంధ్రభూమిలో చక్కని వ్యాసం రాశారు: http://www.andhrabhoomi.net/kalabhoomi/mikkilineni-37 . ఆయన స్మృతికి నీరాజనం.
.
***

వనం ఝాన్సీ అప్పుడే వెళిపోతే ఎలా?

20/02/2011
.
భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా మొదలై..  శక్తిమంతమైన నాయకురాలిగా ఎదుగుతున్న చురుకైన మహిళ వనం ఝాన్సీ అచ్చంపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్న వార్త విన్నప్పుడు మనసు చాలా భారంగా మారింది. ఇది నిజం కాకుండా ఉంటే ఎంతో బాగుండుననిపించింది. ఆమె మృతిని ధ్రువీకరిస్తూ చానెళ్ళలో కనిపించిన బ్రేకింగ్ ప్లేట్స్ ఆందోళనను మరింత పెంచాయి. గతంలో ప్రింట్ మీడియా జర్నలిస్టుగా, ప్రస్తుతం టీవీ జర్నలిస్టుగా, ప్రజెంటర్ గా చాలా మంది రాజకీయ నాయకులతో మాట్లాడాను. కానీ, వ్యక్తిగత స్థాయిలో అనుబంధం ఏర్పడడమన్నది కొందరి విషయంలోనే జరిగింది. అలాంటి వారిలో వనం ఝాన్సీ ఒకరు.
.
ప్రజల పట్ల నిజమైన కన్సర్న్ తో రాజకీయాల్లో ఎదగాలనుకునే వారు మనకు చాలా తక్కువ మంది ఉన్నారు. ఝాన్సీగారు టీవీ కెమెరా ముందే కాకుండా ప్రైవేటు సంభాషణల్లోనూ తన జిల్లాలోని ప్రజల సమస్యల గురించి, వారు పడే యాతనల గురించి కళ్ళు చెమ్మగిల్లుతుండగా చెప్పడం నాకు బాగా గుర్తు. ఆమె నిజంగా.. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలనే తపనతోనే రాజకీయాల్లోకి వచ్చారని నాకు చాలా సార్లు అనిపించింది.
.
వనం ఝాన్సీగారిని చూసినప్పుడు, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏ పార్టీకి చెందిన వారన్న ప్రశ్నే తలెత్తదు. విద్యార్థి దశ నుంచి ఒక పార్టీ లైన్ ను నమ్ముకుని, దానికి కట్టుబడి ఆమె తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. తెలంగాణ ఉద్యమంలో ఆమెను నాకు తెలిసి ఏ నాయకుడూ ఒక పార్టీ ప్రతినిధిగా చూడలేదు. గురి తెలిసిన బాణంలాగే ఆమె ఉద్యమంలో దూసుకుపోయారు. మహిళా చైతన్యం గురించి, వెనుకబడిన తరగతుల నుంచి నాయకత్వం ఎదగాల్సిన అవసరం గురించి ఆమె తరచూ మాట్లాడేవారు. బి.జె.పి ప్రత్యేక తెలంగాణ వాదానికి బలమైన వాణి వనం ఝాన్సీయే. ఆమె యాక్సిడెంట్ లో చనిపోయారన్న వార్త విని.. బాగా డిస్టర్బ్ అయి హాస్పిటల్ బయలుదేరబోతుంటే.. “ఝాన్సీ మృతిపై లైవ్ షో నువ్వే చేయాలం”టూ చీఫ్ ఎడిటర్ నుంచి కబురు. భారంగా స్టూడియోలో కూర్చోవడం ఎంత పెద్ద సమస్యో నాకు బాగా అనుభవంలోకి వచ్చింది. గొంతు గద్గదమవకుండా మాట్లాడాల్సి రావడం ఒక శిక్ష. నిన్న హెచ్.ఎం.టి.విలో ఉదయం 11.30 గం.ల నుంచి గంట వరకూ నేను నిర్వహించిన లైవ్ షోలో అన్ని పార్టీల వారూ ఝాన్సీని ఆత్మీయంగా తలచుకోవడం ఆశ్చర్యమనిపించలేదు. నన్నపనేని, రోజాల నుంచి కవిత, విమలక్క గద్దర్ ల వరకూ అందరూ ఝాన్సీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజల పక్షాన నిలిచిన రాజకీయవేత్తగా ఆమెకు “జయహో” అని నీరాజనాలు పలికారు.
.
నాకు తెలిసిన ఝాన్సీ ఒక సింపుల్, హంబుల్.. డైనమిక్ లీడర్. నిజామాబాద్ అర్బన్ ఉప ఎన్నికలో వేల మంది మహిళా కార్యకర్తలను, బి.జె.పి అభ్యర్థి గెలుపును తెలంగాణ ఉద్యమానికి ఓ విజయంగా అభివర్ణించి నడిపించిన ఝాన్సీ.. వ్యక్తిగత సంభాషణల్లో ఎంతో నిరాడంబరంగా కనిపించే ఝాన్సీ ఒక్కరేనా అనిపించేది. ఆచరణలో దూకుడుగా, ప్రవర్తనలో మర్యాదగా మెలగడం ఝాన్సీ నుంచి నేర్చుకోవలసిందే.
.
పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఝాన్సీ.. తన కులాన్ని పోలరైజ్ చేయడానికి కూడా ఎంతో కృషి చేశారు. వెనుకబడిన సామాజిక వర్గాల చైతన్యాన్ని స్వప్నిస్తూ.. ఆ సామాజిక వర్గాలలోని ఫ్రాగ్మెంటెడ్ వాస్తవికతలను అర్థం చేసుకుని, దాన్ని మహిళా చైతన్యంతో సమన్వయ పరచడం తెలిసిన ఝాన్సీ అప్పుడే ఈ లోకం నుంచి వెళ్ళి పోవడం చేనేత బాధితుల ఉద్యమానికి, వెనుకబడిన సామాజిక వర్గాల పోరాటానికి, మహిళా రాజకీయాకాంక్షల సంఘర్షణకు, తెలంగాణ సమరానికి తీరని లోటు. ఝాన్సీ ఏయే వ్యవస్థల నుంచి విచ్చుకత్తిలా దూసుకొచ్చారో.. ఆ వ్యవస్థల నుంచి… ఆ సామాజిక నేపథ్యాల నుంచి మరెంతో మంది ఝాన్సీలు రావాలి. అదే ఆమెకు మనమిచ్చే నివాళి.
.
***

శుభాకాంక్షలు

01/01/2011

మిత్రులకు..

హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.  కాల ప్రవాహాన్ని కనిపించని రేఖలతో సంకలించిన కొత్త అధ్యాయంలోకి అడుగిడుగుతున్న శుభవేళ.. ప్రతి క్షణం ఆనందార్ణవమై వికసించాలని కాంక్షిస్తున్నాను.

- మీ

పసునూరు శ్రీధర్ బాబు

శీతవేళ.. తూనీగ శబ్దం.. వసంత వర్షం.. కొన్ని జపనీ హైకూలు..!

15/12/2010
.
(మరొకసారి హైకూ ప్రపంచంలోకి వెళితే.. కొన్నింటిని మిత్రులతో పంచుకోవాలనిపించింది. ఇది జపనీ మహనీయుల హైకూలను తెలుగులో ఒకసారి గుర్తు చేసుకోవడమే కానీ.. సాధికారిక అనువాదమనే అహంకార ప్రకటన కాదు. అందుకే.. ఇది వినమ్ర నివేదన)

మత్సువో బషో (1644-1694)


పాత సరస్సు
నీళ్ళ శబ్దంలోకి
కప్ప దుమికింది
.
ప్రశాంత నిశ్శబ్దం
తూనీగ శబ్దం
బండరాయిలోకి చొచ్చుకుపోతోంది
.
కొంగ కాళ్ళు
చిన్నవైనాయి
వసంత వర్షంలో
.
శీతల ఉద్యానం
నూలుపోగులా సన్నబడ్డ చంద్రుడు
కీటకాల పాట
.
***

యోసా బుసాన్ (1716-1783).


శీతవేళ
గంట శబ్దం
గంటను వదిలి వెళ్తోంది
.
వేసవి నదిని
దాటుతున్నా
చెప్పుల్ని చేతబట్టుకుని
.
ఖాళీ అయిన పొలంలో
దిష్టిబొమ్మ కాళ్ళు
ఎంత పొడుగ్గా, ఎంత సన్నగా ఉన్నాయి?
.
***

కోబాయాషీ ఇస్సా (1763-1827).


కీచురాయి
దిష్టిబొమ్మ పొట్టలోంచి
అరుస్తోంది
.
ఇదంతా నీదే
సీతాకోకచిలుకా, ఓ పుట్టగొడుగు మీద
విశ్రాంతి తీసుకో!
.
సూర్యాస్తమయాన్ని
గుర్రం పిల్లతో పంచుకుంటూ…
ఓ నత్త
.
పిల్లి పిల్ల నర్తిస్తోంది
గిరగిరా తిరుగుతూ…
రాలుతున్న ఆకులు
.
గడ్డిలో దాగుడు మూతలు
ఆడుతూ..
కప్ప
.
***

మసావోకా షికి (1867-1902).


చెట్టు తెగిపడింది
నా చిన్ని కిటికీలో
తొందరగా సూర్యోదయం
.
నిశ్చలం…
కొలను నీటి మీద
మెరుస్తున్న మిణుగురులు
.
ఎలా పాడాలీ అని
కప్పల బడి, కోకిలల బడి
కలబడుకుంటున్నాయి
.

***

Follow

Get every new post delivered to your Inbox.

Join 487 other followers