అనేకవచనం, Uncategorized

“ప్రకృతి పరిణామాన్ని దర్శించిన శ్రీధర్ బాబు” -సౌభాగ్య

కవిత్వమొక కాలాతీత కాంతిరేఖ. ఒక మెరుపు. ప్రణాళికాబద్ధమైన వాటికి అది లొంగదు. సిసిరో అన్నట్లు అది ప్రకృతి నుంచే సరాసరి కవులకు అందుతుంది. ఆ వెలుగులో కవి జ్వలిస్తాడు. రూపాంతరం చెందుతాడు. తక్షణ అనుభూతిని కవి వజ్రంలా మెరిపిస్తాడు. నక్షత్ర వర్షం కురిపిస్తాడు. ప్రతి కవికీ ఒక ఫిలాసఫీ ఉంటుంది. అది సామాజికం కాదు. వ్యక్తిగతమైంది. వ్యక్తినిష్ఠమైంది. పసునూరు శ్రీధర్ బాబు “నిన్ను నీవు వ్యక్తీకరించుకోవడంలోని అసంపూర్ణత్వంలో ఆనందముంది” అంటాడు. భావనలో, అనుభూతిలో ఉన్న అసంపూర్ణం కాదది. అనుభవం తాలూకు అసంపూర్ణమది. ‘కవిత్వం పుట్టుకకు స్థలకాలాలు ఉన్నప్పటికీ కవి నుంచి వేరుపడిన తరువాత అది Independent entity అవుతుంది. అని కవితకు ఒక స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తున్నాడు.

Image

ఒక పరిసరాన్ని పారవశ్యంగా సమీక్షిస్తాడు ‘నల్ల సముద్రంలో రాలిన తెల్లచంద్రుడు తీరం వేపు కొట్టుకొస్తున్నాడు/ సహారా ఎడారిని వెంటేసుకొచ్చిన వైణికుడు నక్షత్రాల్ని  రాల్చుతున్నాడు/ గాలి మౌనంగా ఉంది.. ఆకాశం ప్రేక్షకునిలా ఉంది’ అని తన మనసు పొరల్లోని జ్ఞాపక సుమం విచ్చుకోవడానికి ఒక వాతావరణాన్ని, అనుకూలాన్ని ఆయాచితంగా అందుకున్నాడు. అక్కడినించీ పరిసరాన్ని మరిపించే ఒక పరివేదన, ప్రశాంతంతో సమన్వయించిన ఒక కలత కలలా వస్తుంది.

‘నువ్వు గుర్తుకు వస్తావ్ నా జలసమాధిలో జీవానంతర పరీమళంలా/ నన్ను మరిచిపోతాను నక్షత్రాలన్నా రాలిన ఆకాశంలా” అంటూ చలిస్తాడు. సౌకుమార్యమన్నది స్వచ్ఛమైనది. గతాన్నీ భవిష్యత్తునూ అసరమైతే వెలిగిస్తుంది. వద్దనుకుంటే విదిలిస్తుంది. అక్షరాల గుండా ఒక సంగీతం ఆనందం దుఃఖపు జీర కలగలిసిపోతాయి.
ఏదో సందర్భంలో మనిషి తన అస్తిత్వాన్ని గురించి ఆలోచనలో పడతాడు. శరీరం మనసు సానుకూల పరిస్థితిలో స్వరపరిచిన సంగీతంలా సానుకూలంగా సాగుతాయి. ఒక గాయం, ఒక వేదన, అనుకోనివి జరగడం, జరిగినవి అనుకోకపోవడం వంటివి మానవ జీవితానికి అనివార్యం. అనివార్యం నించే కళ జన్మిస్తుంది. అప్పుడు కవి తన అస్తిత్వ రహస్య అన్వేషణలో మునుగుతాడు. మహా సుకుమారమైన అనుభూతులకు అక్షర రూపాన్నివ్వడం శ్రీధర్ బాబుకు తెలుసు. అనుభూతికి అలౌకిక స్పర్శనివ్వగలిగే అక్షరశక్తి అతన్ది. తన్మయత్వపు పల్చటి పొరలు విప్పుతూ ఆశ్చర్యపరుస్తాడు.
‘మెత్తని చీకట్లో పారదర్శక రాగాలనేకం/ ప్రపంచం మౌనంగా నిద్రిస్తున్నప్పుడు స్వరాలు పరాగమై హత్తుకున్న గమ్మత్తయిన అలికిడి… ఇలా నైరూపయ అనుభూతికి
విస్పష్టమైన రూపాల్ని ఇస్తూ సాగుతాడు.
వంకీలు తిరుగుతున్న హృద్యమైన వూపిరి/ పలకరించే జ్ఞాపకాలు పక్షుల్లా వచ్చి ఓ వరసలో కూర్చుంటాయ్.. అన్నీ తెల్లనివే’ అంటాడు.
అమూర్తాలకు మూర్తిమత్వాన్నివ్వడానికి విచిత్ర రస సంయోజన అవసరం. ఆ రసాయనం కవి దగ్గర మాత్రమే వుంటుంది. జీవితం దుఃఖమయం. ఎంతమంది తాత్వికులు ఎన్ని మార్గాలు చెప్పినా బతుకు మనిషిని గాయపరుస్తూ ఉల్లాసంగా సాగుతుంది. మనిషి పడే బాధని, మనసు పడే వేదనను శ్రీధర్ బాబు గాఢంగా ఆవిష్కరిస్తాడు.
ప్రకృతి పరిణామాన్ని నిశితంగా దర్శించినవాడు శ్రీధర్ బాబు. గాలి, మబ్బులు, ఆకాశం వింత వింత హొయలు చిమ్ముతూ అతని మనసు మీదుగా సాగుతాయి. స్పందనల్ని వాటికి అందించి పంపుతాడు.
కవుల వూహలకు అంతుండదు. అంతుంటే అతను కవి కాడు. అనుకరిస్తే కవి కాడు. వూహ స్వతంత్రమైనది. మౌలికమైనది ఐతేనే అతను నిజమైన కవి. శ్రీధర్ బాబు స్వతంత్ర భావుకుడు. మనిషి ఏకవచనం కాదు, అనేకవచనమంటాడు. ఎన్నో నేనులు కలిస్తే ఒక నేను అవుతాడు. ‘నేను నీలోంచీ… నీవు నాలోంచీ.. మనిద్దరమూ మరెవడిలోంచో… సామూహిక ఆత్మల సహస్ర విచ్ఛేదనలోంచి..’

ఈ జననం వెనక ఈ జన్మ వెనక వున్న అనంత ప్రవాహాన్నీ ప్రదర్శిస్తాడు. ఒక తన్మయత్వం, ఒక స్వప్నపు జీర శ్రీధర్ బాబు వూహల్ని అక్షరాలని తాకుతూ వుంటుంది. దేన్నయినా భావించేటప్పుడు ఒక పారవశ్యపు కెరటం దృశ్యాన్ని కమ్ముకుంటుంది.
తప్త స్వప్నమ్ అన్న కవితలో… ‘స్వప్న సరోవరంలో ఎవరదీ?/ పట్టుకుచ్చుల వింజామరల్ని భుజాన వేసుకుని నీళ్ళూపడానికి వస్తున్న మీనమా?’ అంటాడు. సమస్యని సాదాసీదాగా వర్ణించి ఫలానా పని చేస్తే పరిష్కారం దొరుకుతుంది అంటూ రాసేవన్నీ పేలవ నినాదాలుగా మారిన పాత కవిత్వ పరిచయం వున్న ఆధునిక కవులు కవిత్వ స్పృహతో వుంటారు. మౌనానికి కవిత్వానికి మధ్య వున్న తేడా వాళ్ళకు తెలుసు. కవిత్వమంటే ఏమిటో తెలిసినవాడు పసునూరు శ్రీధర్ బాబు.
ఒక అద్భుత ద్వీపం నుంచి వచ్చిన అపురూపమైన ఆనందం కవిత్వమవుతుంది. ‘మేడ మీద కుర్చీ.. కుర్చీ చుట్టూరా వెన్నెల.. వెన్నెలకు పూసిన రెండు చేతులు../ నను నిమిరిన బిడియపు స్పర్శలు వెంటేసుకుని ఈ దారినే వెళ్తూంటుందప్పుడప్పుడూ..” ఇలాంటి మధుర మనోహర వూహల్లో మన మనసు వుల్లాస తరంగితమవుతుంది.
ప్రకృతి పరివర్తనకి, రుతుధర్మానికి మానవ రాగద్వేషాలకు అజ్ఞాత అంతరంగిక సంబంధముందని కవి చెబుతాడు. అది సహజంగా చెప్పినట్లుంటుంది. పనిగట్టుకు పరిశోధించినట్లుండదు.
“వర్షాలకీ జ్ఞాపకాలకీ ఏదో గొప్ప సంబంధమే వుంది” అంటూ ఆలోచనలో పడతాడు. దేనికో ఒకదానికి లొంగిపోవడంలో జీవితం లేదు. ఆమోదించడం వేరు. ఆత్మ సమర్పణ వేరు. నిరంతర స్పృహతో జీవించడం వేరు. అసలు జీవితమంటే అదనీ ఇదనీ చాలా గొప్పదనీ దానికి ఎన్నో రంగులు పులిమి రచ్చకీడుస్తూ వుంటాం.
“నన్ను నేను పట్టుకోలేకపోయినప్పుడే నేను జీవిస్తుంటాను
అప్పుడు కొన్ని భవిష్యత్ జ్ఞాపకాలు పలకరిస్తాయి
ఈ జీవితం పెద్ద గొప్పదేం కాదు
దీన్ని మళ్ళీ అనుభవించాల్సిన పని లేదు”
ఈ మాటల్లో పసునూరు శ్రీధర్ బాబు మౌలిక తత్వం ఇమిడి వుంది. తన అదుపులో తను లేనప్పుడు, అదుపులో తను లేనన్న స్పృహ వున్నప్పుడు మనిషి సజీవంగా వుంటాడన్నది శ్రీధర్ బాబు నమ్మకం. అంతేకాదు, జీవితం మరీ గొప్పదేం కాదు. రెండోసారి జీవించడానికి కాదు అన్న నిర్ణయం అతన్ది.
విచిత్రమైన వూహల్లో స్వతంత్ర చింతనతో ఆకర్షించే ఈ కవి అందర్నీ ఆకర్షిస్తాడు.

***

(నాకిష్టమైన సుకుమార భావుకుడు సౌభాగ్య “ఈకాలం కవులు” శీర్ఖికన ఆంధ్రభూమి దినపత్రిక “సాహితి” అనుబంధంలో 8 మే, 2008న రాసిన వ్యాసం.)