In you the wars and the flights accumulated.
From you the wings of the song birds rose.
You swallowed everything, like distance,
Like the sea, like time. In you everything sank!
అని నెరూడా లాగా అనగలడు. కానీ,
It is the hour of departure, oh deserted one అంటో Song of despair లేమీ ఆలాపించడు.
అలాగని విచారమేమీ లేదని కాదు. ఉన్నదంతా విచారమే. దిగులే. కోల్పోవడం గురించి కాదు. పొందుతున్నవేదన. పొగిలి పోతున్న దుఃఖం. ‘గుండెలో ఒక కందిలి పగిలి’ వేడి గాజు పెంకులు గుచ్చుకుని రక్తమోడుతున్న హింస.
రాయాలని కూర్చొంటే, తెల్లటి తడితో కళ్ళలోంచి రాలుతున్నాయి నల్లటి పదాలై ఈ పై అక్షరాలు
కొంత ధూళై కొంత దూరమై
కొంత నెత్తురై కొంత శాపమై
నేను ఎప్పటికీ తిరిగి తాకలేని ఒక మహా కాంతి లోకమై… అంటాడు. “మృగాలు సంచరించే చదరపు గదుల హృదయాల” మధ్యకు ఎదుగుతున్న పూవుల్లాంటి బిడ్డల్లాంటి మహా కాంతిలోకాలకు దూరం దూరమవుతూన్న దగ్ధత్వంతో.
Leaning into the afternoons I cast my sad nets
towards your oceanic eyes.
There in the highest blaze my solitude lengthens and flames,
its arms turning like a drowning man’s అంటూ ప్రేమలో సముద్ర నేత్రాల్లోకి విషాదాల వలల్ని విసిరి సమున్నత జ్వాలల్లో సుదీర్ఘ ఏకాంతంలా కాలిపోతూ మునిగిపోతూ చేతులెత్తి మొక్కుతూనే ఉంటాడేమో ప్రేమంత్రనగరికి అరుదైన అతిథిలా వచ్చి వెళ్ళిపోయిన నెరూడాలానే మళ్ళీ. తప్పదు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నప్పుడు అప్పుడప్పుడే మెరిసి నా ఆత్మలా మిణుకు మిణుకు మంటున్న తొలి నక్షత్రాలను చీకటి పక్షులు ముక్కుతో గిల్లుతుంటాయి కదా.
The birds of night peck at the first stars
that flash like my soul when I love you. (Leaning into the afternoons)
అవును కదా. ఆత్మల్ని వెలిగించే జ్యోతులు కదా స్త్రీలు.
అందుకే అంటాడు శ్రీకాంత్:
నన్ను నిర్వచించే నన్ను రచించే
నాకు మిగిలిన ఒకే ఒక జననం
అని పిలువనా నిన్ను?
నాకు మిగిలిన ఒకే ఒక మృత్యువు
అని పిలవనా నిన్ను.
నాకున్న ఒకే ఒక సత్యం
అని పిలువనా నిన్ను.
స్త్రీకి దేహమే కాదు. హృదయం ఉంది. ఆలోచన ఉంది అని గుర్తు చేయడానికి వేల ఏళ్ళ పుక్కిటి పురాణాల అరణ్యాల తరువాత, తేనెలు పూసిన ప్రబంధాల గాయాల తరువాత చలం లాంటి విధ్వంసకుడొకడు పుట్టాల్సి వచ్చింది. అయినా బీటలు పడ్డాయి కానీ గోడలింకా కూలనే లేదు. అలాంటి చోట “అనేక డిస్కోర్సుల వాచక కర్మాగారాలలోంచి, వివిధ ప్రతీకలలోంచి, వివిధ చిహ్నాలలోంచీ వివిధ ప్రతిరూపాలలోంచీ స్త్రీకి ఆపాదించబడిన ప్రత్యేక లక్షణాలలోంచి స్త్రీని విడదీసి స్త్రీని చూడటం ఎలా?” అని అడుగుతున్నాడు ఈ కవి. “When we say woman, do we have a possibility to reach women, as such?” అని తనను తానే ప్రశ్నించుకుంటున్నాడు. స్త్రీకి దరి చేరే దారులను వెతుక్కుంటున్నాడు. Cliched images నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న స్త్రీలకు పురుష వాచకాలతో తోరణం కడుతున్నాడు.
నీళ్ళని చీల్చే పాదాలూ, ఎదురీదీ నిర్మలంగా వెళ్ళే కళ్ళూ నీవి
అలా ఎదురు చూడకు
దీపం అంటిన చీకటి
మెరుస్తోంది ఇక్కడ. నీ వద్దకు రాలేని ఈ గోడలపై నిలువెత్తు
నీడలై నేనై –
అందుకే ఆ వెంటనే పశ్చాత్తప్తుడై అంటున్నాడిలా:
చర్మాన్ని వొలిచి, వెలుపలికి మలిచి
బల్లపై ఒక కూజా వలె, ఒక పూల పాత్ర వలె ఉంచి వినమ్రతగా
తప్పుకోగలను: ఊయలలూపే నీ చేతులు
క్షణకాలం ఆగిన చోట నుంచి –
ఇక్కడ నాకు సదా బాలకుడు ఇస్మాయిల్ గుర్తుకు వస్తున్నాడు.
“నీ బాహువుల్లో నన్ను బంధించి
నా దేహానికి కొత్త ద్వారాలు తెరుస్తావు!
నీ వ్రేళ్ళ మంటల్తో నన్ను కాల్చేసి
నా దేహానికి క్రొత్త చర్మం తొడుగుతావు.
ఇస్మాయిల్ కవితలోనూ స్త్రీని ఉన్నతంగా, మహిమాన్వితంగా చూపినప్పటికీ అది వైయక్తికం. శ్రీకాంత్ స్త్రీ ప్రేమను taken for granted గా తీసుకోకపోవడమే కాకుండా, ప్రేమానుభవ సాంద్రతను గాఢంగా గ్రహించడమే కాకుండా, ‘ఆమె’ను conscious గా చారిత్రక, సామాజిక నేపథ్యంలోంచి దర్శిస్తూ, guilt నీ వ్యక్తం చేస్తున్నాడు.
Familistic hegemony నుంచి, Ideological constructs నుంచి, సంకెళ్ళ వంటి మెటఫర్ల నుంచి, దేహం చుట్టూ అల్లిన రాజకీయాల ముళ్ళ కంచెల నుంచి బయటపడడానికి పోరాడుతున్న స్త్రీని ప్రేమిస్తున్నాడు. ఆమె పోరాటాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ కవితల పుస్తకంలోకి తెలుపు తెరుస్తూనే…
ఏమీ కానీ స్త్రీలు, ఏమీ మిగుల్చుకోని స్త్రీలు… ఎందుకో కానీ ప్రేమిస్తారు… అంటూ తప్త గీతాన్ని ఆలపిస్తాడు శ్రీకాంత్.
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
ప్రేమ అనుకుని, ప్రేమను అందుకుందామని
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
…..
అద్దాలలోంచి మన ముఖాల్ని లాగడానికీ
ముఖాల్లోంచి అద్దాలను తీసివేయడానికీ, మన హృదయాలను భక్షించి
తమ హృదయాలను శిక్షించుకుని, చిందరవందర అయ్యేందుకూ
ఉక్కిరి బిక్కిరి చేసేందుకూ
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు….
వచనంగా ఒక్కోసారి వాచ్యంగానూ భ్రమింప చేసే ఈ సాదా సీదా వాక్యాల అంతర్లయలో ప్రచ్ఛన్నంగా ధ్వనించే ఒక విరోధాభాస, ఆలోచన కన్నా ముందే గుండెను కుదిపేసే గాఢత మనల్ని వెంటాడుతుంది. పునరుక్తిని ఒక నిర్మాణ వ్యూహంగా సంధిస్తూ అద్భుతంగా ఈ పద్యాన్ని నడిపిస్తాడు శ్రీకాంత్.
ఇలా ఈ పుస్తకంలో స్త్రీల గురించి, gender sensibilities గురించి, స్త్రీ పురుషుల ప్రేమల గురించి, స్త్రీల బహు రూపాల గురించి రాసిన కవితలు dominant గా కనిపిస్తాయి. ఒక్కోసారి ఒకే కవితలో స్త్రీలను వారి విభిన్న రూపాలలో ప్రేమిస్తున్న complexity ద్యోతకమవుతుంది.
నిన్ను చదువుదామని అనుకుంటాను ఎలాగో ఒకలా. ..
తెలుసు నేనొక నిస్సహాయుడిని. పదాలనే హత్తుకుని ఆఖరి నెత్తురు చుక్క వరకూ నీ వద్దకు పారాడే ఒక శరణార్థిననీ…
నిన్ను చదువుదామని అనుకుని, రాత్రిని ఒక మంట చేసి వెలిగిస్తే, శరీరం అంటుకుని కాలుతుంది తెల్లటి పరదాలలో నిన్నిక చదవద్ద్దో చదవద్దో అంటో, నీడల్ని ఆర్పే వేకువ కాంతై, వేకువ కాంతిని ఆర్పే పొగమంచై, తెల్లగా, ఇక నుదిటిపై అరచేయంత చల్లగా, తల్లి దీవెనలాగ, ఇలాగ, నీలాగ. (ఇలాగ).
తనువంతా చిట్లిన అమ్మ
తనువే లేకుండా మిగిలిపోయిన చిట్టి అమ్మ – అటువంటి అమ్మని
రాత్రి తనువుని పెనవేసుకుని
అటువైపుకు తిరిగి నిదురోయే అమ్మని, ఎందుకైనా ఎవరైనా ఎలా కదపటం? (అమ్మ)
ఇంకా, “మన అమ్మలు, నువ్వు లేక, వంట చేసిన ఆ అరచేతులు, ఒక అమ్మ, అమ్మ చెప్పిన కథ, అమ్మ కళ్ళు, తను, నీలాంటి చీకటి, అమ్మలే, అమ్మీ, మా చిన్ని అమ్మ, నీ హృదయం…” ఇలా శ్రీకాంత్ కవిత్వావరణంలో స్త్రీలు రకరకాల రూపాల్లో కనిపిస్తారు. మనకు తెలిసీ తెలిసీ గుర్తించని, గ్రహించని రూపాల్లో, మన sub-conscious biased natureతో గడ్డ కట్టుకుపోయిన prejudicesతో చీకటిలో చూడలేక పోతున్న స్త్రీమూర్తుల గాథలను ఈ కవి మనకు వినిపిస్తాడు.
ఒక paragraphicలో ‘ఆమె’ వైపు నుంచి narration వినిపిస్తూ, “మీ మగవాళ్ళకెందుకు ఎప్పుడూ అదే యావ కాసింత సేపు మాట్లాడలేరా ప్రేమగా” అని తిట్టిస్తాడు. ఆ మాట ఎప్పుడంటుంది తను: “ఇక తను మోహంతో నిను గాట్టిగా చుట్టుకుని వదలకుండా పెనవేసుకొన్న సంగతి అంటావా కొండ చెలువల కౌగిలి నెమలీకలతో సమానం: మురుగా ఇక తరువాత ఏమిటీ అంటే చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు… ఇంతా చేసి ఆనక తీరికగా అంటుంది.”
ఇళ్లకు మగవాళ్లు సమయానికి ఎందుకు రారోనని ఆనక తినీ తినక కడుపులోకి ముడుచుకుని పడుకున్న ఆమె ముంగిట్లోకి తూలుతూ చేసుకున్న ఓ Confession ‘ఒక సాధారణ వాచకం’:
విరిగి విరిగి నిదుర లేక తిరిగి లేచి, నన్నే
ఈ స్మశానాన్నే శుభ్రం చేసి
నా తల వద్ద ఒక ప్రమిదె వెలిగించినదీ నీవే.
శ్రీకాంత్ తను దేశ దిమ్మరిని, దేహదిమ్మరిని, భాషా దిమ్మరిననీ అని చెప్పుకుంటాడు ఇంతకు ముందు 2002లో ప్రచురించిన “యితర” కవిత్వ సంపుటిలో. యితరుడిలోంచి యితరుడిలోకి గాయాన్ని మోస్తున్న పాటలా సంచరిస్తాడు ఆ కవిత్వంలో. దాన్ని తొంభై తొమ్మిది శోకాల శ్లోక గీతం అన్నాడు వేగుంట ‘మో’హన ప్రసాద్.
అంతకు రెండేళ్ల ముందు “కొన్ని సమయాలు” అంటూ మొదటి పుస్తకం వేశాడు. ‘ప్రేమించేదారిలో మనుషులు ఒంటరి వాళ్ళవుతారు… గాయపడతారు. ఈ దేహం ఇక సహకరించకపోవచ్చు కవిత్వంలో కవిత్వం లేనంతగా.’ అంటూ తెలుగు కవిత్వంలోకి తనదైన డిక్షన్తో వచ్చాడు. Content విషయంలో కొత్తదంతో పాటు formలో తనదైన సంతకాన్ని – దేహాన్ని ఉలితో చెక్కుకుంటున్న గాయాలతో చిప్పిల్లిన రక్తంతోనే చేశాడు.
యితరకు వచ్చేటప్పటికి experimentalist లాగా తను లక్ష్యిస్తున్న రూపం ఇదీ అని చెప్పగలిగాడు. అయితే, అతడి కవిత్వ పర్యావరణం ఇప్పటికీ స్థూలంగా అలాగే ఉంది. అందులోనే కొత్త ఉద్యానాలూ, తుపానులూ, ఉత్పాతాలూ కొత్త రూపాల్లో సాక్షాత్కరిస్తున్నాయి మరింత matured planeలో మరింత లోతుగా, మరింత సన్నిహితంగా ఈ కొత్త సంకలనంలో.
ఈ కవితా సంకలనం పేరు ‘శ్రీకాంత్’. Does this text, does this body, does this textual body carry the name Srikant? అని అడుగుతాడు శ్రీకాంత్ ఈ పుస్తకం చివరి పేజీలలో ముద్రించిన 2013లో సారంగ కోసం అఫ్సర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఏమైనా శరీర వాచకం, వాచక శరీరాలు రెండింటికీ కలిపి ఉన్న ఏకైక భౌతిక గుర్తింపు “శ్రీకాంత్”యే కాబట్టి, ఆ పేరే టార్కోవస్కీ నలుపు-తెలుపుల నాస్టాల్జియా నిశ్చల చిత్రంతో టైటిల్గా సెటిలై పోయిందనుకుందాం. ‘కవిత్వం నాకు ఒక గూడు’ అనే శీర్షికతో సాగిన ఈ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ తనను తాను కోల్పోయి ‘రాతలో శరణార్థి’గా ఉన్నానని చెప్పుకుంటాడు. ఇదొక prologue లాంటిది. అతడి కవిత్వంలోకి open అవడానికి ఇది ఒక తాళం చెవిలా పనికొస్తుంది)
‘వాచక విముక్తం లేక, వినిర్మాణం కాలేక శరీరమంత తోలుమందం వాక్యాల పునరుక్తమై…” అంటూ అలమటిస్తున్నాడు శ్రీకాంత్ ఈ కొత్త కవిత్వంలో ఇంకా భాషతో పేచీ ఒక కొలిక్కి రాక.
ఇది ఇంకా కొనసాగే యుద్ధమే. కానీ, ఈ అభిమన్యుడు ఇప్పటికే చాలా దూరాన్నే ఛేదించాడు. ‘కృష్ణబిలాల’ మాయలన్నీ ధ్వంసం చేసే పనిలోనూ ఉన్నాడు. పదాలు పాతవే, పద చిత్రాలు కొత్తవి. వాటితో కొత్త రంగుల్ని, అర్థాల్ని ఆవిష్కరించే collage చేస్తున్నాడు కవిత్వంలో. అంతకన్నా వినిర్మాణం ఏముంది?
“నేను నవ్వి, నేను ఏడ్చి, నేను పగిలి, పిగిలి ‘నేను’ లేకుండాపోయి, ఇదిగో వచ్చి ఇల్లా రాస్తున్నాను ఈ అమృత క్షుద్ర పదాలని, ఒక మార్మిక ఆదిమ తపనతో. ఒక తొలి మలి రహస్య దాహంతో.”
సిగ్గుతో చితికిన గుజరాత్ గాయం లాంటి దేశంలో, “పురుషాంగమే ఒక దేశమైన, దేశమంటేనే పురుషావయవమైన ఒక కాలంగా… ఈ ఒక్క పూటకి ఇలా నేను: నన్ను నన్నుగానే ఉంచు” అని, Don’t you know that I aint a metaphor అని ఖాండ్రించిన తెంపరితనమూ ఉంది ఈ క్షుద్ర పదాలలో అమృతంతో పాటు.
ఇంకా పిల్లల గురించి రాసిన కవితలు కొన్ని తాదాత్మ్యం కలిగిస్తాయి. నిదురలో ఏదో కలవరించి లేచిన మూడడుగుల మల్లెపూవు లాంటి బిడ్డ వచ్చి నిద్ర లేపితే, ‘తెల్ల గులాబీ మొగ్గల వంటి ఆ కళ్ళనీ / ఇలా చూసుకుంటూ, ఇక ఈ రాత్రి / నువ్వైనా నేనైనా ఎలా నిదురోగలం? అంటాడొక చోట.
“నిండుగా పారే ఆ పిల్లల నిదురలోకి నువ్వు నీ ఆత్మనీ, శరీరాన్నీ కోల్పోయిన వేళ? ఏమైనా జరగనీ, ఏమైనా కానీ, కానీ ఒకరినొకరు గట్టిగా పెనవేసుకొని నిదురించే పిల్లలనీ, వాళ్ళ కాలాన్నీ కలలోనైనా కదిలించకు. ఊహామాత్రంగానైనా పిలవకు. ఎందుకంటే నీ పునర్జన్మ నీ ముందే రూపుదిద్దుకునే సరైన ఇంద్రజాల సమయం జనిస్తోంది ఇప్పుడే, ఇక్కడే, అందుకే!” (పిల్లల నిద్ర)
“ఏం చేయాలో తెలియదు నీకు, పిల్లలు నిన్ను పట్టుకుని బావురుమన్నప్పుడు –
ఎంత మిట్ట మధ్యాహ్నం అయినా, నీ లోపలి ఆవరణలో కురుస్తుందో నల్లని మంచు.
….. చూడండి నిజంగా తెలియదు నాకు. ఏం చేయాలో, పిల్లలు అలా నన్ను వాటేసుకుని బావురుమని ఏడ్చినప్పుడూ, వెక్కిళ్ళతో అలా తినకుండా నిదురోయినప్పుడూ. మరి అప్పుడు, అక్కడ వాలిన పూలను చూస్తూ చేయాలో, మీకేమైనా తెలుసా ఇంతకూ?” (పిల్లలు నిన్ను పట్టుకుని ఏడ్చినపుడు)
అంతేకాదు,
“అయిపోయాం పెద్దరికంతో పేదవాళ్ళం ఎపుడో
ఇక చిన్నారుల తోటలోకి అడుగు పెట్టడం ఎలా?” అని దిగులుపడుతున్నాడు. సంపదనంతా కోల్పోతూ మనం ఏ
దారిద్ర్యంలోకి పెరుగుతున్నామో కూడా చెబుతాడు.
“ఇంధ్రధనుసులు తెలియని
ఏక రంగోన్మాదులు వాళ్ళు
నా పిడికెడు స్థలంలో వామనుడి పాదాలతో వాళ్ళు– (పిడికెడు)
…..
ఇది జీవితం. ఊరుకో హత్యలకు గురి కాకుండా కలలతో మిగిలిన మనిషి ఎవరూ లేరిక్కడ (కథలు చెప్పే మనిషి)
ఇట్లా ఈ కవిత్వం… ప్రేమలు, ఆత్మలు, దేహాలు, దేహ రాజకీయాలు, దేశ రాజకీయాలు, ముఖపుస్తకాలు నక్షత్ర ప్రసారాలు మాత్రమే తెలిసిన ఇరుకు చూపులు, మనుషులు లేని అంతర్జాలాలు, కాగి కాగీ చిక్కగా మరుగుతున్న Subaltern దుఃఖాలలో దేశ/హ దిమ్మరిలా తిరుగుతోంది.
అయినా ఏ దేహమూ మిగుల్చుకోలేదు, ఏ పదాలూ దాచుకోలేదు (యితర) అంటాడు శ్రీకాంత్. కవి తాను పదను పెట్టి, రాటు దేల్చిన పదాలతో కొత్త భాషను సృష్టించుకుంటాడు. ఆ భాష ఒక వాచకంలా (ఈ paragrahical/ prose poetryని, అవ్యాకరణ వాక్య సమూహాల్నిశ్రీకాంత్ కవిత్వమనేమీ చెప్పడం లేదు. Text అనే అంటున్నాడు) వెలిగిపోయి, ఒక ప్రశ్నలా నిలబడితే అంతకన్నా గొప్ప కవిత్వమేముంది.
ఇంతకీ ఆ ప్రశ్న స్థూలంగా:
“గీతకు ఇవతలా, గీతకు అవతలా సరే. కానీ, గీత గీసింది ఎవరు? గీతను కాపాడుతున్నది ఎవరు?”
ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. ‘భూమి పైకి ఒంగి పరిహసిస్తున్న కాళరాత్రి’ కింద నడుస్తున్న …
బాటసారీ దేహధారీ
వెలిగించుకున్నావా ఒక దీపం?
అట్టే పెట్టుకో మరి నిన్ను నువ్వు
ఆ రెండు అరచేతుల మధ్య-
ఇక ఆరిపోనివ్వకు
నీ హృదయాన్ని.
***