Uncategorized

పోగొట్టుకున్నవన్నీ భద్రంగా దాచుకున్నవాడు Yehuda Amichai

ఇతడు ఇంతదాకా నువ్వు రాసిన కవిత్వాన్ని మార్చగలడు. ఇతడు ఇంతదాకా నువ్వు సత్యం అనుకున్న దాన్ని సందేహంలా నిలబెట్టగలడు. ఇతడు నీ నిఘంటువులోని పదాలను కొత్త అర్థాలతో దారి తప్పించగలడు. నీదీ తనదీ కాని దారిలోకి ఇతడు నిన్ను సునాయాసంగా తోసేయగలడు. నీకు కనిపించే ప్రతి దాన్నీ నీ కంటిలో యౌవన ప్రతిమగా ప్రతిష్ఠించగలడు. గాయాలను దోసిళ్లలో పోసి నిన్నొక నిప్పుల కుంపటి చేయగలడు. రక్తాన్ని రణంతోనూ, ప్రణయంతోనూ మరిగేలా చేయగలడు. చివరికి నిన్ను చరిత్రలోకి వేళ్లూనుకున్న చెట్టును చేసి నిన్ను నేటి తుపానులో నిలబెట్టగలడు. నీ శిరస్సు మీద రేపటి సూర్యోదయం మొగ్గ తొడిగేలా చేయగలడు. ఒక్క మాటలో… అతడు నిన్ను నీకివ్వగలడు.

అతడు యెహుదా అమిహాయ్ (Yehuda Amichai).

అతడు నిన్ను నీకిచ్చిన తరువాత నువ్వేమంటావంటే:

Now I have recovered from the lesson.

The hair of my head

Is cropped, like a soldier from the

Second World War,

Round and round, and my ears not only hold up my skull

but the whole sky.

అవును. నీ తల మీద మోపబడిన పాఠాల బరువును దింపుకుంటావు. యుద్ధానికి దిగిన సైనికుడిలా నీ తలనంతా ఎవరో మట్టంగా గొరిగేస్తారు. ఇక అప్పుడు నీ చెవులు నీ కపాలాన్ని కాదు, మొత్తం ఆకాశాన్ని తొడుక్కుంటాయి.

‘బాగా అలసిపోయిన నా తల

ఒకసారి తెగిపడి నా వెంట్రుకల ఛాతీ మీద పడింది

అక్కడే మా నాన్న వాసన నాకు తగిలింది మళ్లీ,

చాలా ఏళ్ల తరువాత’ (Things that have been lost)

ఇలాంటి కవిత్వాన్ని ఇటీవలి కాలంలో ఎక్కడైనా విన్నారా? తండ్రి ఛాతీ మీద తల వాల్చిన చిన్ననాటి అనుభూతిని ఎంత బలంగా గుర్తు చేసుకున్నాడు అలసిపోయిన క్షణాల్లో.

“I don’t live like a poet, nor do I look like one, and I have the child in me. My escape route to childhood is always open.” ఆ దారులన్నీ మనకు కనిపిస్తాయి ఆయన కవిత్వంలో. కానీ, ఎక్కడికి తప్పించుకుంటాడు? మహా అయితే, కుడి కంట్లోంచి ఎడమ కంట్లోకి. లేదంటే అట్నుంటి ఇటూ.

‘నా కళ్లు

పక్క పక్కనే ఉన్న రెండు సరస్సుల్లాగా

ఒక దానిలోకొకటి ప్రవహించాలనుకుంటున్నాయి

తాము చూసిందంతా పరస్పరం చెప్పుకోవడానికి’ (Six poems for Tamar)

ఆయన metaphorsలోజీవం ప్రవహిస్తుంటుంది. ‘మా నాన్న చేతులు నదులై ఆయన చేసిన పుణ్య కార్యాల్లోకి ప్రవహించాయి’ అంటాడొక చోట. తల్లిని స్మరించుకుంటూ, ‘ఆమె దుఃఖాల నడుమ లోతైన అగాధాల్లోకి అలా నడిచి వెళ్లిపోవాలనుకుంటాను’ అంటాడు. అదొక కొత్త గొంతుక. అతనిదొక సరికొత్త aesthetic identity. అతడు మరీ పాతవాడేం కాదు. నిన్న మొన్నటి దాకా మన మధ్యే ఉన్నాడు. రెండో ప్రపంచ యుద్ధం చేసిన గాయాల నుంచి, ఇజ్రాయెల్ – పాలస్తీనాల ఎడతెగని హింసాత్మక శిథిలాల నుంచి, కొత్త మిలీనియం ముంగిటి దాకా ఒక స్ఫటికంలా జీవితంలోని భిన్న కోణాలను, వర్ణాలను కవిత్వంగా పరావర్తనం చెందించాడు. 2000 సెప్టెంబర్ 22న భౌతికంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. కానీ, తరతరాలకు సరిపడా జీవితాన్ని తన సాహిత్యంలో ఆవిష్కరించాడు. ముఖ్యంగా, కవిత్వంలో విస్తృతి, వస్తు వైవిధ్యం ఏ స్థాయిలో సాధ్యమవగలదో చూపించాడు.

అందుకే, ఆయన కవిత్వంలోకి వెళ్తుంటే చారిత్రక విషాదాలు ఉప్పెనలై విరుచుకుపడతాయి. అమానవ యుద్ధ బీభత్సాలు హృదయాన్ని కకావికలం చేస్తాయి. మానవ ప్రేమలు, వాంఛల సహజాతాల ఉత్సవ సౌరభాలు దేహాన్ని ఆలింగనం చేసుకుంటాయి.

జర్మనీలోని Wurzburgలో సంప్రదాయ యూదు కుటుంబంలో పుట్టిన Amichai అసలు పేరు Ludwig Pfeuffer. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ఆ కుటుంబం 1936లో పాలస్తీనాకు వలసపోయింది. అప్పుడు ఆయన వయసు 12 ఏళ్లు. Amichai రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యంలో పని చేశాడు. అప్పటికింకా ఇజ్రాయెల్ ఏర్పడలేదు. స్వాతంత్ర్యం కోసం ఇజ్రాయెల్ 1948లో చేసిన యుద్ధంలో పాల్గొన్నాడు. 1956, 1973లో జరిగిన ఇజ్రాయెల్ – అరబ్ యుద్ధాలలోనూ పోరాడిన ఈ కవి హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేంలో చాలా ఏళ్లు సెకండరీ స్కూలు విద్యార్థులకు పాఠాలు బోధించారు.

ఇజ్రాయెల్ స్వతంత్ర పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనడంతోనే ఆయన కవిత్వ ప్రస్థానం మొదలైంది. వలస జీవన విషాదాన్ని, యుద్ధ భూమిలో ప్రత్యక్ష నరకాన్ని చూసిన అనుభవాలు యెహూదాను పూర్తిగా విలక్షణ కవిగా మలిచాయి. 1955లో (Now and in Other Days) తొలి కవితల పుస్తకాన్ని ప్రచురించిన యెహూదా ఆ తరువాత మరో 10 సంకలనాలు ప్రచురించారు. కథలు, నవలలు కూడా రాశారు. యుద్ధం నుంచి శాంతిని, శిథిలాల నుంచి నిర్మాణాన్ని, గాయాల నుంచి ప్రణయాన్ని ఆశించడమే ఆయన కవిత్వ సారాంశంగా కనిపిస్తుంది. ఆయన పోరాటం పట్ల మాత్రమే నిబద్ధుడు కాదు. ఆయన పరిపూర్ణంగా మనిషి జీవితం పట్ల నిబద్ధుడు. సగటు మనిషి కోరుకునే ప్రేమానందాల స్వచ్ఛమైన జీవనకాంక్షకు నిబద్ఢుడు.

ఇజ్రాయెల్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఈ కవి అక్షరాలు దాదాపు 40 భాషల్లోకి తర్జుమా అయ్యాయంటే ఆయన కవిత్వంలోని వైవిధ్యం, సార్వజనీనత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జర్మన్ భాష మీద మంచి పట్టు ఉన్నప్పటికీ యూదుల ప్రజల భాష హిబ్రూనే తన కవిత్వ భాషగా ఎంచుకున్న ఈ కవి తల్లి గురించి రాశాడు. తండ్రి గురించి రాశాడు. స్నేహితుల గురించి రాశాడు. శత్రువుల గురించి రాశాడు. ప్రియురాళ్ల గురించి రాశాడు. ‘Houses are always like ships’ అంటూ బతుకులోని అస్థిరత్వం మీద రాశాడు. శిథిల నగరం మీద రాశాడు. కొత్త గోడలో పొదిగిన సమాధి ఫలకాలతో తన కవిత్వాన్ని నిర్మించుకున్నాడు.

నా కామ్రేడ్‌ను నేను నా వీపు మీద మోశాను

అప్పటి నుంచి ఆ బరువు ఎప్పుడూ నాతోనే ఉంది

ఏదో బరువైన స్వర్గం నా మీద వాలినట్లు,

అప్పటి నుంచీ అతడికి తన కింద

విల్లులా వంగిన నా వెన్ను స్పర్శ తెలుస్తూనే ఉంది. (Since then)

In the Mountains of Jerusalem అనే కవితలో, ‘ఇక్కడ శిథిలాలు మళ్లీ భవనంగా నిలబడాలని కోరుకుంటున్నాయి/ …ఇక్కడ ముళ్లు కూడా గాయపరచీ పరచీ అలసిపోయి, ఇక ఓదార్పు ఇవ్వాలనుకుంటున్నాయి’ అంటాడు.

Here where a ruin wants

to be a building again, its wish is added to ours.

Even thorns are tired of hurting and want to console,

and a tombstone, torn from a desecrated grave,

is placed in the new wall with its name and dates,

happy that now it will not be forgotten.

ఈ నగరంలో దేనికీ తీరిక లేదు. ఇక్కడి తోటలు, చెరువులు, సమాధులు అన్నీ గతాన్ని గుర్తు చేసుకునే పనిలో తీరిక లేకుండా ఉన్నాయంటాడు. తమను మరిచిపోతారేమోనని దిగులుపడుతుంటాయనీ అంటాడు. ఎందుకంటే, మరిచిపోవడమన్నది మామూలు విషయం కాదు. అది లోపలి దీపాన్ని ఆర్పేసుకోవడం లాంటిదేననీ ఒక భరించలేని దట్టమైన చీకటిని గుర్తు చేస్తాడు.

To forget someone

Forgetting someone is like

Forgetting to put out the light in the back yard

And leaving it on all day:

But it’s the light

That makes you remember.

యెహూదా కవిత్వమంతా ఒక దట్టమైన జ్ఞాపకం, ఆయన కవిత్వంలో చరిత్ర ఒక వేళ్లూనుకున్న జ్ఞాపకంలా వెంటాడుతుంది. సంప్రదాయబద్ధంగా మత గ్రంథాలు చదువుకున్నవాడు కావడం వల్ల బైబిల్ కథలనూ, పురాగాథలనూ తన కవిత్వ శైలికి ఒక అంతర్లయగా నిర్మించుకున్నాడు. మనిషి నిర్మించుకున్న భాష, సంస్కృతి, జీవన విధానాల నడుమ హృదయం ఉనికి ఎక్కడ ఉందని ప్రశ్నిస్తాడు చాలా చోట్ల.

యెహూదా కవిత్వంలో magnum opus గా భావించే ‘Jerusalem 1967’ అనే దీర్ఘ కవిత ఎలా మొదలవుతుందో చూడండి:

This year I travelled a long way

To view the silence of my city.

నిశ్శబ్దాన్ని వినడానికి కాదు, చూడడానికి వెళ్తున్నాడు. ‘మళ్లీ నా నగరానికి వచ్చాను. మళ్లీ గొంతెంత్తి ఏడుస్తున్నాను. ప్రతి ఉదయం నేను అప్పుడే పుట్టిన ఒక పసిబిడ్డ గొంతునై ఏడుస్తున్నాను. ఈ నగర రాత్రిలో తారలు నీటి బుడగలై మెరుస్తున్నాయి’ అంటాడు.

Jerusalem, the only city in the world

Where the right to vote is granted even to the dead

అన్నప్పుడు నిరంతర యుద్ధాల నడుమ శిథిలమైన రక్తమోడుతున్న గాయం ఎంత తీవ్రంగా ఉందో మన అనుభవంలోకి వస్తుంది. ఈ నగరం ఇప్పుడు ఇద్దరు ప్రేమికులను విడదీసినట్లుగా ఉందంటాడు ఇదే కవితలో మరో చోట. ఇటు ఇజ్రాయెల్‌లో Yehuda అయినా, ఆయనకు దాదాపు సమకాలికుడైన పాలస్తీనా కవి Mehmoud Darwish అయినా ఆధిపత్య హింసనే వ్యతిరేకించారు. Plural society లో సామరస్యాన్నే కోరుకున్నారు. ఇద్దరూ ‘Resistance Poets’ అయినా, Darwish is more political. ఆయన Zionism కు వ్యతిరేకంగా రాశారనే విమర్శలు వచ్చాయి. కానీ, ‘I have right to this whole inheritance’ all civilisations in history have come to Palestine అని స్పష్టం చేస్తూ పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు భిన్న ధ్రువాలు కాదంటాడు దర్వీష్. ఇజ్రాయెల్ ట్యాంకుల మధ్య నా మాజీ యూదు ప్రేయసిని స్మరించుకోవడమే నా మానవీయ స్పృహ అని తేల్చేస్తాడు. ఏమైనా, ఇది యుద్ధం కాదు, జీవన విధ్వంసం అన్న వేదన ఇద్దరి కవిత్వాల్లో మహాద్భుతంగా కనిపిస్తుంది.

ఇంకా ఏమంటున్నాడు యెహూదా ‘జెరూసలెం 1967’ కవితలో…

God it angry with me

Because I always force him

to create the world once again

from chaos, light, a second day, until

man, and back to beginning.

అని ఈ ప్రపంచాన్ని మళ్ళీ మొదటి నుంచి కొత్తగా నిర్మించమంటున్నాడు. ఈ అసమానతలు, ద్వేషాలు, యుద్ధాలతో ప్రపంచం దారి తప్పింది. దీని ప్రయాణాన్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలని పదే పదే అడుగుతున్నందుకు దేవుడికి కోపం వస్తోందట.

Jerusalem is full of Jews used by history

Second-hand Jews, with small flaws, bargains.

చరిత్ర వాడి పడేసిన యూదులతో జెరూసలేం నిండిపోయిందని తీవ్రావేదన వ్యక్తం చేసిన యెహూదా జెరూసలేం నగరంలోని శిథిలాలూ, ఉద్యానాలూ, సరస్సులూ అన్నీ కూడా జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంలో మునిగిపోయాయని అంటారు.

ఇంతటి బలమైన సామాజిక కవిత్వాన్ని రాసిన యెహూదా తన కవిత్వాన్ని సామాన్యుడి ‘pain and joy’ అనే నిర్వచించుకున్నాడు. ఆ ‘joy’ ఆయన కవిత్వంలో ఎంతో లోతైన ప్రేమగా వ్యక్తమవుతుంది.

A young girl goes out in the morning, like a knight

A young girl goes out in the morning

Pony-tailed and swaying as if on horseback.

Dresses and handbags, sunglasses, chain and buckles,

Are like armor on her.

But beneath all this

She’s light and slender.

Sometimes at night she’s naked and alone.

And sometimes she’s naked and not alone.

You can hear the sound of bare feet

Running away: that was death.

And afterwards the sound of a kiss

Like the fluttering of a moth

Caught between two panes of glass.

రాత్రిపూట కొన్ని సార్లు ఆమె నగ్నంగా ఒంటరిగా, మరికొన్ని సార్లు ఆమె నగ్నంగా… ఒంటరిగా కాదు అనడంతో ఒక మోహాన్ని వాక్యాలతో వెదజల్లుతాడు. అప్పుడేమవుతుంది? మృత్యువు నగ్నపాదాల చప్పుడు వినిపిస్తుంది. ఆ తరువాత ఒక ముద్దు శబ్దం. అదెలా ఉంటుందంటే, కిటికీ తలుపుల మధ్య ఇరుక్కున్న సీతాకోక రెక్కల చప్పుడులాగా! ఇక ఆ తెల్లవారుజామున ఆ అందాల యువతి శూరవనితలా అలా వెళ్లిపోతుంది.

‘The Selected Poetry of Yehuda Amichai’ లో 1955-70 ల మధ్య కవిత్వాన్ని Stephen Mitchel అనుదిస్తే, ఆ తరువాతే 1971 నుంచి రాసిన కవిత్వాన్ని Chana Bloch అందించారు. ఆమె అయితే, ‘Love is the centre of Amichai’s world’ అంటారు.

A pity, We were Such a Good Invention అనే కవిత చదివితే ఆమె అలా ఎందుకన్నారో తెలుస్తుంది. అమిహాయ్‌ స్మరించుకునే వాళ్లెవరైనా ఈ కవితా వాక్యాలను ఉటంకించకుండా ఉండరు. ప్రేమికులు విడిపోవడం ఎంత బాధాకరంగా ఉంటుందో ఇంతకన్నా తీవ్రంగా ఎవరూ చెప్పి ఉండరు. ఇది యెహూదా దాదాపు పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు రాసిన కవిత.

They amputated

Your thighs from my hips.

As far as I’m concerned, they’re always

Doctors, All of them.

They dismantled us

from each other. As far as I’m concerned,

they are engineers.

A pity. We were such a good and loving

Invention: an airplane made of a man and woman,

wings and all:

we event got off

the ground a little.

We even flew.

నా కటి నుంచి నీ తొడల్ని తెగ్గోశారనడంతోనే పాఠకుడు ఒక సంచలనానికి గురవుతాడు. అంత బాధ పెట్టిందీ ఈ సమాజం. వాళ్లు ఆచారాలు, కట్టుబాట్లు అనే పేరుతో సున్నితంగా విడదీస్తారు. నాకు సంబంధించినంతవరకు వాళ్లు వైద్యులే అంటాడు. ఇద్దరినీ ఒకరి నుంచి మరొకరిని వేరు చేశారు, ఇంజనీర్లు అని నిష్టురపడుతూ ‘మనమే ఒక చక్కని ప్రేమ సృష్టి’ కదా, మనం చక్కగా రెక్కలు కట్టుకుని ఎగరడం కూడా నేర్చుకున్నాం కదా… ఇంతలోనే అంత దారుణమా?

ఒక అనుభవాన్ని కళ్లకు కట్టించే దృశ్యాన్ని చేసి, ఆ దృశ్యాన్ని అద్భుతమైన formలో బంధించి, తిరిగి ఆ అనుభవంలోకి లాక్కెళ్లే ఈ Ludwig Pfeuffer (అమిహాయ్ అసలు పేరు) కవిత్వాన్ని పలవరిస్తుంటే, నాకిష్టమైన మరో Ludwig (Wittgenstein) గుర్తుకు వస్తున్నాడు. ‘The possibility of all the similes, of all the imagery of language, rests on the logic of representation’ అంటాడీ జర్మన్ తత్వవేత్త. ఎందుకంటే, …the thought is expressed perceptibly through the senses కాబట్టి. అనుభవాన్ని ఇంద్రియానుభూతం చేయడానికి గొప్ప కవి పదాలకున్న ప్రాతినిధ్యాల్ని పునర్నిర్వచిస్తాడు. అందుకొక విస్తృత ఉదాహరణ అమిహాయ్ కవిత్వం.

Airhostess, I don’t know if history repeats itself, Six poems for Tamar, Poems for a woman, Love song, My father in a white Space suite, A Quiet Joy… ఇలా ఒక్కో కవితా ఒక్కో అనుభవం. ఇది యెహూదా ప్రపంచం. ఈ ప్రపంచంలో నిల్చుని నేనూ అంటున్నానిలా:

‘I am standing in a place where I once loved

The rain is falling. The rain is my home.’ (A Quiet Joy)

ఇది యెహూదా అమిహాయ్ కవిత్వం. నేను ప్రేమించిన కవిత్వం. నా మీద వర్షిస్తున్న కవిత్వం. ఈ వర్షం నా నివాసం.

అందుకే అన్నాను:

ఇతడు ఇంతదాకా నువ్వు రాసిన కవిత్వాన్ని మార్చగలడు. నిన్ను చరిత్రలోకి వేళ్లూనుకున్న చెట్టును చేసి నిన్ను నేటి తుపానులో నిలబెట్టగలడు. నీ శిరస్సు మీద రేపటి సూర్యోదయం మొగ్గ తొడిగేలా చేయగలడు. ఒక్క మాటలో… అతడు నిన్ను నీకివ్వగలడు.

***

వ్యాసాలు

పదే పదే గుర్తొస్తోంది Pablo Neruda కవిత ‘Nothing but Death’

10 quotes by Pablo Neruda on love and loss to awaken the romantic in you -  Education Today News

I thought the love would last forever, I was wrong అని WH Auden అన్నప్పుడు గుండె చెదిరిపోయింది. ఇప్పుడు నక్షత్రాలు అక్కర్లేదు, చంద్రున్ని పొట్లాం కట్టి పారేయండి. సూర్యుడ్ని ముక్కలు ముక్కలు చేసేయండి. సముద్రాల్ని గుమ్మరించి అడవుల్ని తుడిచిపెట్టేయండి. ఇప్పుడిక దేనితోనూ ఏ మంచీ జరిగేలా లేదని Funeral Blues https://allpoetry.com/Funeral-Blues కవితలో పిచ్చెక్కినట్లు అరుస్తాడు ఆడెన్. ఒక మరణం మిగిల్చిన వేదన. మృత్యువు దాహం తీర్చుకుని వెళ్లిపోయిన తరువాత మిగిలిన ఎడారిలో మోగే ఒంటరి రోదన.

గడియారాలన్నీ ఆపేయండి

ఫోన్లన్నీ కట్ చేయండి

మొరగకుండా ఆ కుక్కకు ఓ బొక్కను పడేయండి

పియానోల నోరు నొక్కి, మూగబోయిన డప్పుల చప్పుడుతో

శవ పేటికను బయటకు తెండి, ఏడ్చేవాళ్లను పిలిపించండి.

ఎందుకీ దుఃఖం అంటే, ప్రేమ ఎప్పటికీ ఉంటుందనుకున్నాడు. అది తప్పని తెలుసుకున్నాడు. మనిషి అది తప్పని పదే పదే తెలుసుకుంటూనే ఉన్నాడు. అంటే, తెలిసి తెలిసీ తప్పు చేస్తూనే ఉన్నాడు.

ఇప్పుడెందుకీ కవిత్వం అంటే, గడియారాలు ఆగిపోలేదు. ఫోన్లు మోగుతూనే ఉన్నాయి ఆర్తనాదాల్ని, మరణవార్తల్ని చెవుల్లో గుమ్మరించేందుకు. గుండెను జలదరించేందుకు. కరచాలనాలను దూరం చేసిన కరోనా కాలంలో కర స్పర్శలే కనుమరుగవుతున్నాయి. ఆలింగనాలు నేరమైన రోజుల్లో ఆత్మీయుల డిజిటల్ ప్రజెన్స్ కంట్లో పిక్సెలేట్ అయిపోతోంది.

ఎక్కడిదీ బాధ. ఎందుకీ కష్టం? నిశ్చల సమాధిలో కళ్లు తెరిచి చూస్తున్నప్పుడు వినిపిస్తున్న చీకటి వికారాన్ని ఎట్లా జయించడం? శబ్దం మేల్కొలుపుతుంది, నిశ్శబ్దం నిద్రపోనివ్వదంటాడు ‘మో’ బహుశా పునరపిలో అనుకుంటా. అదీ పరిస్థితి. “నేను మృత్యువు కోసం ఆగలేను కాబట్టి, అతనే దయతో నాకోసం ఆగాడు’ అన్న ఎమిలీ డికిన్సన్, ఇంకా… “మృత్యువు ఎక్కడో లేదు/ నా పక్కనే/ అతని చిరునవ్వు కోసమేగా నేను/ గంటలు గంటలు వేచి చూస్తూ వుంటాను” అంటూ మృత్యువు హాస్య ప్రియత్వానికి హసించి, పరవశించిన అజంతా గుర్తుకు వస్తున్నారు, మృత్యువాక్య పరిష్వంగంలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

ఎవరో ఎందుకు? నేను కూడా రాసుకున్నాను కదా ‘నువ్వు నేను మృత్యువు’ https://anekavachanam.wordpress.com/…/%E0%B0%A8%E0%B1…/ అనే కవితలో… ‘వెలుగులోకి చీకటి జూలు విదిల్చి నెమ్మదిగా అడుగుపెడుతున్నట్లు ప్రాణంలోకి మృత్యువు చొరబడుతున్న క్షణాల్లో గుర్తొచ్చే బతికిన క్షణాల్లో వినిపించే రాగాల నయగారాలు ఉవ్వెత్తున ఎగసిపడి మీద పడి తడిమేసి తడిపేసి తోసేసినప్పుడు నువ్వు నేను మృత్యువు కలిసే కదా ఆ సంబరంలో కొట్టుకుపోయాం’ అని. అవాంఛిత అతిథితో ఈ funeral celebration పుట్టినప్పుడే మొదలైందన్నాను కదా?

అయినా, మృత్యువు భయపెడుతుంది, బాధిస్తుంది. ఎందుకంటే, అది శాశ్వతంగా కోల్పోవడం అంటే ఏమిటో అనుభవంలోకి తెస్తుంది. అందుకే, అదంటే భయం, గౌరవమూనూ.

అందుకేనేమో, కవిత్వంలో మృత్యువు ఎంతో అందంగా, ఆత్మీయంగా కనిపిస్తుంది. ఏ అవలి తీరాల నుంచి వచ్చానో అక్కడికే వెళ్లాలి కదా అన్న స్పృహ కవిని మృత్యు సాహచర్యానికి ప్రేరేపిస్తుంది. సజీవ మృత్యు సాక్షాత్కారానికీ కరుణిస్తుందేమో.

అందుకే, మృత్యు సంచలనం లోలోన చెలరేగినప్పుడల్లా నాకు గుర్తొస్తుంది Pablo Neruda రాసిన ‘Nothing but Death’ కవిత. We die going into ourselves, as through we were drowning inside our hearts, as though we lived falling out of the skin into the soul అంటాడు నెరూడా మృత్యువును అంతర్ బహిర్లోకాలలో దర్శిస్తూ, దాని వర్ణాన్ని, శబ్దాన్ని చూపిస్తూ, వినిపిస్తాడు.

మృత్యువు మనతోనే, మనలోనే ఉంటుంది. మృత్యువు అంటే మనలోకి మనం వెళ్లిపోవడమే అనీ అంటాడు. మన శిథిల నౌకాయానాల తుది తీరాల వద్ద స్వాగతం పలికే అడ్మిరల్ మృత్యువు. ఒకసారి చదివితే ఈ కవిత ఇక మృత్యువులా వెంటాడక మానదు.

ఈ కవితను తెలుగులో ఇప్పటికే కొందరు అనువదించారు. మహాకవి శ్రీశ్రీ కూడా “మరేముంది మరణం తప్ప” అని తెలుగులోకి తర్జుమా చేశారు. కానీ, నాకెందుకో అవేవీ సంతృప్తినివ్వలేదు. అనువాదాల్లో ఎక్కువ స్వేచ్ఛ తీసుకోవడం న్యాయం కాదన్నది నా నమ్మకం.

నేను కూడా ఆ కవితను తెలుగు చేయాలని ప్రయత్నించి చాలా సార్లు కాగితాలు చించి చెత్తబుట్టలో పారేశాను. నెరూడా స్పానిష్‌లో రాసిన ఆ కవితను ఇంగ్లిషులోకి కూడా చాలా మందే అనువదించారు. అయితే, Robert Bly చేసిన అనువాదమే https://poets.org/poem/nothing-death నెరూడా సమగ్ర కవితల సంకలనంలో కనిపిస్తుంది. దాన్నే ప్రామాణికంగా చూస్తున్నారు. నిజానికి, మనకు స్పానిష్ తెలియకపోయినా ఇంగ్లిషులో ఆయన అనువాదంలోనే ఒక ధార కనిపిస్తుంది. ఈ కవిత ప్రతిసారీ కొత్తగా, తన లోతులు ఇంకా కనుక్కోమంటూ సవాలు విసురుతున్నట్లే కనిపించేది.

కానీ, ఈ సందర్భంలో మళ్లీ చదివినప్పుడు అది మరింతగా దగ్గరైనట్లనిపించింది. ఆ అనుభవాన్ని సమీపించిన అనుభూతి కలిగింది. ఇదిగో చూడండి నా అనువాదం. ఎక్కడైనా తప్పడటడుగు వేసి ఉంటే నిర్దయగా కామెంట్లతో విరుచుకుపడండి.

.

మృత్యువొక్కటే”

…..

ఒంటరి శ్మశానవాటికలు

చప్పుడు చేయని ఎముకలతో నిండిన సమాధులు

చీకటి చీకటి చీకటి సొరంగంలోకి

శిథిల నౌకలా కొట్టుకుపోతున్న గుండె

మనం మనలోకే పోతూ చచ్చిపోతాం,

మన గుండెల్లోనే పడి నిండా మునిగిపోతాం,

చర్మం లోపల బతికి ఆత్మలోకి రాలిపోతున్నట్లు.

.

అవిగో అక్కడ శవాలు

చల్లటి బంక మట్టితో చేసిన పాదాలు

ఎముకల లోపల మృత్యువు

కుక్కలు లేకుండానే అరుపులు వినిపిస్తున్నట్లు,

ఎక్కడో గంటల నుంచి, శ్మశానాల నుంచి వస్తో

వాన కన్నీళ్ల వంటి తడి గాలిలో ఎగబడుతోంది

.

కొన్నిసార్లు నేనొంటరిగా

తెరచాపల కింద పాలిపోయిన శవాలు, మృత శిరోజాల స్త్రీలు

దేవ కన్యల మల్లే తెల్లగా ఉన్న రొట్టెలు చేసే వాళ్లు

నోటరీ గుమస్తాలను పెళ్లాడిన తెలివైన యువతులతో

కొట్టుకొస్తున్న శవ పేటికలను చూశాను

మృత్యు నది మీద

నిటారుగా దూకే చిక్కటి ఊదా రంగు మృత్యు నది మీద

చితా భస్మ పేటికలు పైపైకి పోతుంటాయి

ప్రవాహానికి అభిముఖంగా మరణ మృదంగ నాదం చేస్తూ

అదంతా ఒక నిశ్శబ్ద నాదం.

.

మృత్యువు

పాదాలు లేని చెప్పుల్లా

మనిషి లేకుండా నడిచి వచ్చే దుస్తుల్లా

రకరకాల శబ్దాలతో సమీపిస్తుంది

తలుపు తడుతుంది ఉంగరంతో టక్ టక్ మని కొడుతూ

ఆ ఉంగరానికి ఏ రంగు రాయి ఉండదు, అసలు వేలు కూడా ఉండదు.

వచ్చి బిగ్గరగా అరుస్తుంది నోరు లేకుండా నాలుక లేకుండా

కంఠం కూడా లేకుండా.

దాని అడుగుల చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది

అది వేసుకున్న దుస్తులు గాలికి ఊగే చెట్టులా నెమ్మదిగా సడి చేస్తుంటాయి

.

కచ్చితంగా చెప్పలేను, కానీ నాకు ఏదో కొద్దిగా అర్థమవుతూంటుంది, నాకేమీ కనిపించదు కూడా

కానీ, దాని పాట నాకు తడిసిన ఊదా రంగులా తోస్తుంది

ఈ భూమే సొంత ఇల్లయిన ఊదా వర్ణాలు,

మృత్యువు ముఖం ఆకుపచ్చ రంగులో ఉంది కదా…

అందుకే, అది చూసే చూపు కూడా ఆకు పచ్చ వర్ణమే,

అది ఊదారంగు పత్రం తేమలా

కోపంతో ఊగిపోయే శీతాకాలం మసక రంగులా లోలోకి చొరబడుతుంది.

.

మృత్యువు…

ఇంకా చీపురులా ముస్తాబై లోక విహారానికి బయలు దేరుతుంది

గచ్చును తుడిచేస్తూ, మృతదేహాల కోసం వెతుకులాడుతూ,

మృత్యువు చీపురు లోపలే ఉంది

చీపురు.. శవాల కోసం మృత్యువు సాచిన నాలుక

అది దారాన్ని దేవులాడుతున్న సూది

.

మృత్యువు

మడత పెట్టిన మంచాల్లో ఉంటుంది:

అది బద్ధకపు పరుపుల మీద,

నల్లని కంబళ్లలో నిద్రపోతూ బతుకుతూ

అకస్మాత్తుగా ఊపిరి వదిలేస్తుంది:

విషాద ధ్వనిలా పేలిపోయి దుప్పట్లను ఎగరేస్తుంది

మంచాలు తెరచాపలతో ఆ రేవు వేపు కొట్టుకుపోతాయి

అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది

అత్యున్నత నౌకాదళాధికారి దుస్తుల్తో…

మృత్యువు.

***

పుస్తక సమీక్షలు, Uncategorized

మహాకవి దాశరథి ‘అచుంబిత మనోజగం’

నక్షత్రపురం తోవలో ప్రయాణం ఒక్కోసారి నాకే విచిత్రంగా తోస్తోంది. అక్షరాలు మిణుకు మిణుకుమంటూ పలకరించే బాటలో ఏ మలుపు వద్ద ఎవరు ఎదురుపడతారో తెలియదు. ఎదురుపడిన అక్షర యోగులు మిల మిల మెరిసే చూపులతో నను పట్టుకుని ఎక్కడిదాకా తీసుకువెళతారో తెలియదు. ఏ వీడ్కోలు దగ్గర ఏ చేయి నా భుజాన్ని ప్రేమగా నిమురుతుందో తెలియదు. ఏ చుక్కల చెట్టు కిందో కాసేపు విశ్రమించి కళ్లు తెరిచే వేళకు మరో ఆకాశ సాక్షాత్కారం.
రేవతీ దేవి దుఃఖ స్వగతంలోంచి ‘Man is condemned to be free’ అన్న Sartre ను గుర్తు చేసుకున్నప్పుడు, The limits of language are the limits of my world అని మథనపడుతూ, మనిషి భాషకు బందీ అయిన సంగతిని స్పృహించి, సంకెళ్ళను తెంచే ప్రయత్నం చేసిన Ludwig Wittgenstein పలకరించాడు. Ludwig తో నిశీధి అంచు వెంట సాగిన యాత్రను గమనిస్తూ ఓ మలుపు దగ్గర ‘పరాభూత కవి కరంలో విరిగిన విల్లులాంటి భాష’తో పేచీ పడిన మార్మిక స్వరంలా ఎదురయ్యాడు బైరాగి. ఇప్పుడేమో, ‘నా దారిలో ఎక్కడా మైదానం రాలేదు. బైరాగిలా నూతిలో గొంతుకలు వింటున్నాను’ అని ‘మననం’ చేసుకున్న మహాకవి దాశరథి కనిపించాడు. ‘మెట్లు లేని మేడ మీద / మేలి నీలి ముసుగు తీసి / నవ్వే అందాల తరుణి / నవశారద నిశాశశి’ని చూస్తున్నాడు, చూపిస్తున్నాడు నక్షత్రపుర వీధుల్లో.
ఇంకా ఏమంటున్నాడో తెలుసా?
అర్థమగునె సగం సగం?
అచుంబితం మనోజగం-
పవళించుము నీలో నీ
వెవరిని మేల్కొల్పబోకు;
విచ్చిన ఎద కంటి చూపు
విశాలమై క్రమ్మనీ.
పునర్నవనవోన్మేషంగా దాశరథి వెదజల్లిన ఈ నక్షత్రకాంతిని గుండెను నిండుగా తెరుచుకుని ఒంపుకున్నామా లోపలికి? ‘వెదురు పొదలలో చొరబడి/ రొదలిడు మలిసందె గాలి’ని శబ్దాల్లో పట్టి వినిపించేందుకు ఆయన పడిన వేదనను నిజంగా గుర్తించామా?
dasarathi
మర్రి ఆకుపై విష్ణువు
మాదిరి శబ్దమున శక్తి
సముద్రాన పాలవోలె
సరిగమలో సంగీతం
మనకున్న నిఘంటువులు
విననట్టిది కననట్టిది
నది తరగలలో, భావుకు
మదిలోపలి వింత పలుకు-
నీలో నీవే నిద్రిస్తూ హృదయ నేత్రాన్ని విశాలం చేసి అచుంబిత మనో జగాన్ని వీక్షించమన్నాడు దాశరథి. అంతరంగ సముద్రాన్ని మథించినప్పుడే సరిగమల సంగీతం వినిపిస్తుందనీ, నిఘంటువులకు అతీతమైన వింత పలుకేదో భావుకుని మదిలో వికసిస్తుందనీ గుర్తించిన నిఖార్సయిన కవి దాశరథి. మెట్టులేని మేడగా నభోతలాన్ని దర్శించడం ఆయనకే చెల్లింది. ఇవన్నీ దాశరథి రాసిన “పునర్నవం” సంకలనంలోని ‘అచుంబితం’ అనే కవితలోని పాదాలు.
‘Genuine poetry can communicate before it is understood’ (TS Eliot) అన్నట్లు, ‘కవిత్వం ఉఛ్వాసలోకి చొరబడి గాలికంటే ముందుగా నరాల్లోకి పాకిపోయి ఏదీ అందుకోలేని ఆత్మను తాకుతుంది’ అని గుర్తించిన ఈ కవి సారానికీ, రూపానికీ మధ్య ప్రాణంలా తపించిపోయాడు. చీకటి శిలను శిల్పంగా మలిచే వైయక్తిక సంవేదనను అనుభవించిన వాడు కనుకే నిరసనను నెత్తుటి పాటగా వినిపించాడు. ధిక్కారాన్ని భావోద్వేగభరితమైన సామాజిక ఆకాంక్షకు రూపంగా మండించగలిగాడు.
‘ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్నుబోలిన రాజు మాకెన్నడేని;
తీగలను తెంపి, అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ’
అని దాదాపు ఇరవయ్యేళ్ల ప్రాయంలోనే అని గొంతెత్తిన సాహసి దాశరథి. నిజాం నిరంకుశ పాలనలలో ప్రజలు పడ్డ అగచాట్లు, రైతులు అనుభవించిన బాధలు ఆయనను తీవ్రంగా కలచివేశాయి. ఆ వేదనే పునాదిగా ఆయన కవిత్వాన్ని ఆశ్రయించాడు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత కమ్యూనిస్టు సిద్ధాంతాలు నచ్చక,- బైరాగి లాగే – బయటకు వచ్చి, తెలంగాణ సాయుధ పోరాటానికి నడుం బిగించాడు. నిజాం సిపాయిల నుంచి తప్పించుకోవడానికి అడవుల్లో తిరిగాడు. జైలు పాలయ్యారు. వరంగల్ జైలు నుంచి దాదాపు 30 మంది రాజకీయ ఖైదీలను నిజామాబాద్ జైలుకు తరలించినప్పుడు అక్కడ “ప్రజల మనిషి” వట్టికోట ఆళ్వారుస్వామి పరిచయం కావడం వంటివన్నీ దాశరథి తొలినాళ్ళ కవిత్వానికి బాటలు వేశాయి. మఖ్దూం, కైఫీ ఆజ్మీ, ఇక్బాల్ వంటి ఉర్దూ కవుల ప్రభావం కూడా ఆయనను ముందుకు నడిపించింది.
అయితే, ఆయన కవిత్వంలో ఎప్పుడూ ఒక పార్శ్వమే బలంగా చర్చల్లో కనిపిస్తూ వచ్చింది. ఆయనకు కీర్తి కిరీటాలు తొడిగిన వారంతా చాలా వరకు తెలంగాణ ఉద్యమ కవిగానే గుర్తించేందుకు ఇష్టపడ్డారు. “నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న వాక్యం దాశరథి కవిత్వానికి ప్రతీకగా స్థిరపడిపోయింది. అగ్నిధారలోని ఈ కవితో పాటు దాశరథి అనగానే గుర్తొచ్చే మరొక గొప్ప రచన… ‘ఆ చల్లని సముద్ర గర్భం/ దాచిన బడబానలమెంతో/ ఆ నల్లని ఆకాశంలో/ కానరాని భానువులెందరో?’ అంటూ మొదలయ్యే ‘?’ కవిత.
పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం యెంతో?
గాయపడిన కవి గుండెల్లో
వ్రాయబడని కావ్యాలెన్నో?
కులమతాల సుడి గుండాలకు
బలిగాని పవిత్రులెందరో?
అంటూ స్వాప్నిక సంవేదనలా సాగే ఈ కవిత గొప్ప పాటగానూ కవిత్వ ప్రియుల హృదయాల్లో నిలిచిపోయింది. తెలంగాణను తల్లిగా భావించి, ఆ తల్లి బిడ్డగా తన కుటుంబం అనుభవిస్తున్న పేదరికాన్నీ, వేదననీ ప్రశ్నిస్తాడు దాశరథి. రాచరికాన్ని నిరసించడం, “ప్రజాస్వామ్య సోషలిజాన్ని” స్వప్నించడం వంటి ఆయన కవిత్వంలోని అంశాలు అభ్యుదయవాద విమర్శకులను బాగా ఆకట్టుకున్నాయి. తెలుగు సాహిత్యంలో యాభైలకు పూర్వం నుంచే తెలుగు సాహిత్య విమర్శలో ఆధిపత్యాన్ని చూపిస్తూ వచ్చిన కమ్యూనిస్టు విమర్శ కూడా దాశరథిలోని ఆ పార్శ్వానికే పరిమితమైందేమో అనిపిస్తుంది.
దాశరథి తొలికవితా సంకలనం ‘అగ్నిధార’ 1949లో అచ్చయింది. తెలుగు కవిత్వాన్ని భూమార్గం పట్టించిన శ్రీశ్రీతో తెలుగు సాహిత్యంలో ఆధునికత అంటే అభ్యుదయ సాహిత్యమేనని, భావ కవిత్వం అంతరించిపోయిందనే అభిప్రాయాలు బలంగా ముందుకు వచ్చిన రోజులవి. ‘అగ్నిధార’కు తొలిపలుకు రాసిన దేవులపల్లి రామానుజరావు, ‘తెలుగు కవిత్వంలో శ్రీశ్రీ ఒక కొత్త మార్గము త్రొక్కినారు. ఈ సంప్రదాయము ననుసరించి కవిత్వము వ్రాయు యువకులలో దాశరథి ప్రముఖులు” అని అన్నారు. నిజమే, అగ్నిధారలో శ్రీశ్రీ ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా, అదుగో/ అదుగదుగో/ ఉదయ దిశా వదనంలో/ కదిలే మెదిలే/ తెల తెల్లని తళుకులలో/ నిశాంతాన నశించిన/ విశాల తారకామండలం/ ప్రశాంత మృతి/ సిత ద్యుతులు… అన్నప్పుడు, ‘పదే పదే అనేస్తా, నిరుపేదా’ వంటి కవితల్లో నడక, శాబ్దిక లయ శ్రీశ్రీని గుర్తు చేస్తుంది. కానీ, అగ్నిధార మలిముద్రణకు 1963లో దాశరథి రాసుకున్న ‘పురాస్మృతులు’ పీఠికలో కానీ, అంతకు రెండేళ్ల ముందు “పునర్నవం” సంకలనానికి రాసుకున్న ముందు మాటలో కానీ ఎక్కడా శ్రీశ్రీని ప్రస్తావించకపోవడం కాకతాళీయం కాకపోవచ్చు.
వాల్మీకి నుంచి కాళిదాసును, శ్రీనాథుడినీ స్మరించుకోవడంతో పాటు స్పెన్సర్, హోమర్‌లనూ తలచుకున్న దాశరథి ‘గురజాడ’ ఇవాళ మాయింట్లో పాడుతున్నాడు అని చెప్పుకున్నాడు. ప్రబంధ సాహిత్యాన్ని విస్తృతంగా చదువుకుని సంప్రదాయిక కవిత్వాన్ని సృజిస్తూ వచన కవిత్వంలో విశ్వరూపం చూపేంతవరకు దాశరథి ఎంతో దూరం ప్రయాణించాడు. కానీ, మనమే ఆయనను అగ్నిధార వద్ద ఆపేశామేమో అనిపిస్తోంది. ముఖ్యంగా, ‘పునర్నవం’ గురించి జరగాల్సినంత చర్చ జరగలేదనే అనిపిస్తుంది.
‘అగ్నిధార’లోనూ దాశరథి కవిత్వంలో వైవిధ్యం కనిపిస్తుంది. ఇందులోని కవితలన్నీ 1949కి పూర్వం రాసినవే. చాలా వరకు దాశరథి జైల్లో ఉన్నప్పుడు రాసినవే. వరంగల్ జిల్లా మానుకోటలోని నెల్లికుదురు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయినప్పుడు ఓ ఊరిలో ఆప్యాయంగా ముంతలో మంచినీళ్ళు అందించిన రైతు పిల్ల ఒయ్యారాన్ని చూసి మైమరిచిపోయాను అని చెప్పుకున్న దాశరథికి అప్పుడు ఇరవై ఏళ్ళు. ఇఫ్పుడేమో ఆయన 1925 జూలై 22న జన్మించారని రాస్తున్నారు. వికీపీడియాలోనూ అలాగే ఉంది. కానీ, పాత పుస్తకాల్లో కొన్ని చోట్ల దాశరథి జననం 1927 అని నమోదైంది. ‘జైల్లో అడుగు పెట్టినప్పుడు నా వయసు సుమారు ఇరవై’ అని స్వయంగా చెప్పుకున్నారు కాబట్టి, 1927లో జన్మించారన్నదే నిజమేమో అనిపిస్తోంది. ఈ సంగతిని అకడమిషియన్లు నిర్ధారించాలి. ఆ వయసులో దాశరథి తనను తాను యుద్ధ రంగంలోని సైనికుడిగా సంభావించుకున్నాడు. యుద్ధ భూమిలో కూడా సైనికుడు తన ప్రియురాలిని తలచుకుంటాడని గుర్తు చేశాడు. తన కవిత్వంలో ఈ రెండూ ఉంటాయని మఖ్దూంనూ, కైఫీ ఆజ్మీనీ తనకు బాసటగా ఉదహరించాడు. బైరాగి నూతిలోని గొంతుకలూ వినిపిస్తున్నాయని ప్రకటించాడు.
అస్తమయంలో… అనే కవితలో దాశరథి ఏమంటున్నాడో చూడండి:
నేను పడమరలోకి చూస్తాను – రోజు,
కుంగిపోతున్న సూర్యుని గుండెలోని
వెలుతురులు తాగి, చీకటి కలలు లాగి
రాత్రి సాంతము నిద్దుర రాదు -రోజు.
ఇంకా, “దీపావళి” అనే కవితలో…
భూపావళి బుగ్గి చేసి
కోపావళి నగ్గి ద్రోసి
దీపావళి జరపండో
దేశ దేశ జనులార
తెలంగాణ ఘనులార…
అన్నప్పుడు… ‘దీపావళి ఉత్సవమండీ/ దీపావళి చేద్దాం రండీ/ ఆకాశం మండిద్దామా/ పాతాళం తగలేద్దామా’ అనే బైరాగి ‘దీపావళి’ (చీకటి నీడలు) గుర్తుకు వస్తుంది. కాకపోతే, ‘నైరాశ్యపు చీకటి ముసుగున దాగిన మృత్యువు’ నృత్యం గురించి బైరాగి పాడుకుంటూ పోతే, దాశరథి మాత్రం.. ‘చల్లని చమురుంటేనే దీపావళి.. ప్రజాబలం వుంటేనే ప్రభుత్వాలూ రాజ్యాలూ’ అంటూ ప్రబోధిస్తాడు. మరో దివ్య దీపావళి అంటూ ఆశావాదాన్నీ వినిపిస్తాడు.
ఈ సైనికుడి జీవితంలోని భిన్న పార్శ్వాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి “కవితా కోపం” చక్కని ఉదాహరణ.
నన్ను చూచి ఎందుకొ
మిన్నాగులు ఇట్లా
పారాడుతు జీరాడుతు
వస్తుంటాయి?
నన్ను చూచి ఎందుకు
పున్నాగలు ఇట్లా
తారాడుతు, గోరాడుతు
పూస్తుంటాయి?
ఇదే కవితలో కాస్త ముందుకు వెళితే… ‘నాకు తెలుసు, నాకు తెలుసు/ ప్రళయవేదనా పంకిల ప్రపంచ పథం మధ్య/ ప్రేమలు పొసగవనీ/ ఈ బండరాళ్లపైన ఏ మొక్కలు ఎదగవనీ’ అన్న బైరాగిని దాశరథి మళ్లీ గుర్తు చేస్తాడిలా:
ఏనాడో తెలుసు నాకు
ఈ నిరీహ
నీరవ
నిస్వార్థ
నిర్ధన
నీచ నీచ మానవునికి
నిలువ నీడ లేదు జగతి.
ఇది లోకం
నరలోకం
నరకంలో లోకం నరలోకం.
ఆ తరువాత రుద్రవీణ సంపుటి వచ్చేటప్పటికి దాశరథిలోని ఆత్మాశ్రయవాదం మరింత బలంగా కనిపిస్తుంది.
రానున్నది ఏది నిజం
అది ఒకటే సోషలిజం
అని స్వాతంత్ర్యానంతర జాతీయవాదం ఆయనలో సహజంగానే కొనసాగింది. అప్పటికింకా నెహ్రూ సామ్యవాదం మీద భ్రమలింకా తొలగిపోలేదు. అందుకే, ఆ తరువాతెప్పుడో నెహ్రూను స్మరిస్తూ కూడా కవిత రాశాడు దాశరథి. రుద్రవీణ సమయానికి తెలంగాణ స్వతంత్ర భారతంలో కలిసింది. అందుకే, దాశరథి ఇందులో తెలంగాణను “ముక్త భూమి”గా దర్శించాడు. అయితే, సామాజిక వేదనను అస్తిత్వ గాయంగా, వైయక్తిక వేదనగా వినిపించడంలో ఆయన శిల్పం కొత్త పుంతలు తొక్కిందని ‘రుధిర పక్షులు’ కవిత రుజువు చేస్తుంది.
నీలి మబ్బులు
తేలియాడే
నింగి నిండా
రుధిర పక్షులు
రుధిర పక్షుల
రెక్క బరువుకు
కూలిపోయిన
గాలి సౌధం
గాలి సౌధం
పునాదుల్లో
కాళ్లు విరిగిన
కొత్త రాజులు
కొత్త రాజుల
గుండియల్లో
వచ్చి వ్రాలిన
పక్షి రెక్కలు
పక్షి రెక్కల
పదను కోతకు
తెగిన కాలం
కొత్త రంగులు-
ఇలా సాగుతుందీ కవిత ఒక accomplishment తరువాత చిగురు తొడుగుతున్న కొత్త ఆశకు ఊపిరి పోస్తున్నట్లుగా. రుధిర పక్షులు అనే పదబంధమే అద్భుతంగా ఉంటే, కూలిపోయిన కూలిపోయిన గాలి సౌధం పునాదుల్లో… అంటూ ఒక అమూర్త భావనను conceitతో concreteగా వ్యక్తం చేస్తాడు దాశరథి.
ఆ తరువాత వచ్చిన “మహాంధ్రోదయం” సంకలనం.. ‘మూడు కోటుల నొక్కటే ముడి బిగించి’ ఏర్పడే విశాలాంధ్రను స్వాగతించాడు. అగ్రజులతో కలసిపోవడం కోరుకున్నాడు. కానీ, 1961లో వచ్చిన ‘పునర్నవం’లోని ‘ఘంటాపథం’ కవిత దాశరథి తన గతానికి చింతించాడా అనిపిస్తుంది.
అగామిని గూర్చి వీళ్లకు తోచదు!
అవును మరి, వీళ్లను కాలం దాచదు.
కానీయండి, మన పాత పుణ్యాలు కూలనీండి
మనది డీరెయిల్ అవుతోన్న పొగబండి
అవును..
ఎటొచ్చాం మనం దారి తప్పి?
అని దాశరథి సంధించిన ప్రశ్నలకు కాలమే జవాబులు చెప్పిందా అనిపిస్తుంది. ‘పునర్నవం’ సంకలనం దాశరథి కవితాయానంలో అద్భుతమైన మజిలీ అనిపిస్తుంది. ఈ వ్యాసం ప్రారంభంలో ప్రస్తావించిన ‘అచుంబితం’, జ్యోతిశ్చక్రం, బాల్యం, కిరణ శకలం వంటి కవితలు ఆధునిక శిల్పానికి, అస్తిత్వ పరివేదనకు ఆనవాళ్లుగా కనిపిస్తాయి. పునర్నవం శీర్షికన రాసిన కవితలో దాశరథి కవిత్వాన్ని నిర్వచించే పని చేస్తాడు. “ముసలి మోహం పడిన వృక్షం మీద యౌవనం చిగురించడం కవిత్వం… మనసు మల్లె పొదల్లోంచి పసందైన వాసనలు వీచి/ అవి పద్యాల సీసాల్లో/ అనంతకాలం నిలుస్తే కవిత్వం” అంటాడు.
“మతాలు, రాజకీయాలూ మనస్సుల్ని విరగ్గొడతాయి. కవిత్వం మనస్సుల్ని అతుకుతుంది” అంటూ కవిత్వంలో మానవీయ విలువల ప్రాధాన్యం గురించి చెబుతాడు దాశరథి “మననం” పేరిట రాసుకున్న ముందు మాటలో. మనిషిని మనిషిని చేరే మార్గం లోపలివైపు నుంచే ఉంటుందనీ, ఆ లోపలి మానసిక లోకం మరింత పెద్దదనీ గుర్తు చేస్తాడు.
“I love you as certain dark things are to be loved,
in secret, between the shadow and the soul” (Pablo Neruda)
అన్నట్లు ఈ సామాజికుడిలో ఒక అస్తిత్వవాది సమాంతరంగా కొనసాగాడు. అతడ్ని మనం విస్మరించామా? కేవలం గాలిబ్ గీతాల అనువాదాల్ని, గుండెలో గారాలు పోయే గజళ్లను మాత్రం ప్రత్యేకంగా ప్రేమించి, ఆయన ప్రధాన స్రవంతి కవిత్వంలో దానికి అంత ప్రాధాన్యం లేదని పరిమితమయ్యామా? అందుకే, దాశరథిని మనం మరోసారి చదువుకోవాలి. “మననం” చేసుకోవాలి. పునర్నవ కాంతులతో ఆయన కవిత్వాన్ని re-invent చేయాలి.
***
వ్యాసాలు, Uncategorized

ప్రేమతో తొణికిసలాడే వాక్యం… శివారెడ్డి కవిత్వం

Poetry is ordinary language raised to the Nth power. Poetry is boned with ideas, nerved and blooded with emotions, all held together by the delicate, tough skin of words.
– Paul Engle
నిజమే. ఊపిరి ఆడడం లేదు. (కరోనావైరస్ వల్ల కాదు. ప్రజాస్వామిక భావాలను contagious గా భావించి quarantine చేస్తున్న ఆధిపత్య రాజకీయాల వల్ల. నిజానికి, కరోనావైరస్ తెలుగు నేల నుంచి బతుకు జీవుడా అంటూ ఎప్పుడో పారిపోయి ఉండాల్సింది డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారుతున్న కరోనా కవిత్వ ప్రవాహాన్ని చూసి జడుసుకుని. ఇంత కవిత్వాన్ని అది ఎలా తట్టుకుని నిలబడిందో అర్థం కావడం లేదు). ఈ నిర్బంధంలో అనాది స్వేచ్ఛా గీతాన్నే మళ్ళీ మళ్ళీ పాడుకోవాల్సి వస్తోంది. రాజ్యం ఎంత గొప్పది?కవిత్వానికి relevance పోకుండా ఎంత బాగా చూసుకుంటోంది! ఇప్పటికీ, ఈ కొత్త మిలీనియంలో ఆధునికత, అత్యాధునిక, ఉత్తరాధునికతల వంటి యుగాలు దాటి కవి అదే పాట పాడుతున్నాడు. అదే ఆశను శ్వాసిస్తున్నాడు. అదే శ్వాసను ఆదేశిస్తున్నాడు.
కొంచెం స్వేచ్ఛగావాలి
మనిషిని మనిషని చెబటానికి
పశువును పశువని చెబటానికి
కొంచెం స్వేచ్ఛగావాలి
రాత్రిని రాత్రని చెబటానికి
పగటిని పగలని చెబటానికి
కొంచెం స్వేచ్ఛగావాలి
రెక్కలల్లార్చి గాల్లో ఎగరటానికి-
k sivareddy
యాభై ఏళ్ళుగా ఇదే కలను మెలకువలో కంటూ అక్షరాల్లో వెలిగిస్తూ అనేకానేక సంకలనాలను వెలువరించారు ప్రఖ్యాత కవి కె. శివారెడ్డి. ఇన్నేళ్ళుగా ఆయన కవిత్వమంతా మనిషి-స్వేచ్ఛ చుట్టూనే తిరిగింది. అందుకే, ‘కొంచెం స్వేచ్ఛ గావాలి’ అనే ఈ కవిత అంతకు ముందే ముద్రించిన “పక్కకి ఒత్తిగిలితే”సంకలనంలో ఉన్నప్పటికీ, ‘ఇప్పటి ఈ స్థితికి మరింతగా సరిపోతుందని’ కొత్త సంపుటిలో మొదటి కవితగా ప్రతిష్ఠించారు. మొత్తం సంకలనానికీ ఆ పేరే పెట్టారు.
ఓ కొమ్మ మీద వాన చినుకులకు తడిసి మునగదీసుకున్న పక్షి తానే అయి ఈ పద్యం ఎత్తుకుంటాడు కవి… కొంచెం స్వేచ్ఛగావాలి అంటూ.
రెక్కలల్లార్చడానికి
చినుకుపడ్డ రెక్కల్ని విదల్చటానికి
ఈ కాలు యిలా, ఆ కాలు అలా చాచటానికి-
‘టప్’ మని ఒక చినుకు నెత్తి మీద పడితే
తల పైకెత్తి చెట్ల ఆకుల కేసి చూడటానికి-
మహా మృదువుగా గాలి వీస్తే
ముకుపుటాలు పెద్దవి చేసి కళ్లతో గాలి పీల్చటానికి-
కొంచెం స్వేచ్ఛగావాలి…
ఇలా మొదలవుతుందీ కవిత. మొదట కోట్ చేసింది ఈ కవిత ముగింపు. ఈ కాలు యిలా, ఆ కాలు అలా చాచటానికి… అనడం ఎంత మృదువైన ఆలోచన! చివరికి టప్ మని ఒక చినుకు నెత్తి మీద పడితే తల పైకెత్తి కనీసం చెట్ల ఆకులకేసి అయినా చూడాలి కదా? ఆ స్వేచ్ఛ కూడా హరించుకు పోయిందనడం ఎంత సున్నితమైన వేదన! ఆ తరువాత వాక్యాల నుంచి కవిత అద్భుతంగా మానవీయ స్పృహలోకి మళ్లుతుంది… మనిషిని మనిషని చెబటానికి, పశువును పశువని చెబటానికి అంటూ పదనైన satireను విసిరేస్తుంది. నలుపు, నలుపని తెలుపు తెలుపని చెప్పలేని దుస్థితి పట్ల కలిగిన ఒక తీవ్రమైన ఆగ్రహ ప్రకటనను composedగా వినిపిస్తుంది. చివరికి కవి observed నుంచి observer గా విముక్తమై, “రెక్కలల్లార్చి గాల్లోకి ఎగరటానికి” అని ముగిస్తూ స్వేచ్ఛ దేనికో చెబుతాడు. వాన వెలిసింతర్వాత రెక్కలు విదుల్చుకుని పక్షి మళ్ళీ గాల్లోకి ఎగిరిపోతుంది. ఇక్కడ ఎగరలేని అవస్థలో ఉన్నవాడు మనిషే. పంజరంలో ఉన్న మనిషి.
పైకి చాలా సాదాసీదాగా కనిపించే కవిత. మామూలు పదాలతో, వస్త్వైక్యంలోని celebration కన్నా కొంత ఎక్కువగా narration శైలిలో సాగిన కవిత. కానీ, చెదరని సింటాక్స్‌తో కుదురైన శిల్పంతో పోత పోసుకుంది. Intrinsicగా ఈ కవితలోకి వెళ్ళిపోవచ్చు. Extrinsic factors అదుపు లేకుండా ఆవహిస్తూనే ఉండడం కాకతాళీయం కాదు, కవి వ్యూహంలో భాగం. ఎందుకిలా జరుగుతోంది? ఒక చిన్న (పంక్తుల సంఖ్యను బట్టి) కవిత ఎందుకింత ప్రాపంచిక వేదనని తట్టి లేపుతోంది? ఎందుకంటే, ఇది ఒక personal poem. తానొక పక్షిగా మారిన అనుభవాన్ని కవి లోపల్లోపలికి తీసుకుని వ్యక్తమయ్యాడు. ఆ వ్యక్తమవడంలో ఒక దృక్పథం ధ్వనించింది. అంతేకానీ, ఇక్కడ కవి ఒక దృక్పథాన్ని నినాదం చేసే తాలు పనికి పాల్పడలేదు.
ఒక అనుభవాన్ని నీ లోపల్లోపలికి పరిపూర్ణంగా ఒంపుకుని అంతశ్చేతనతో సంఘర్షించినప్పుడు కదా పుడుతుంది కవిత్వం. ఈ చర్య లేకుండా కాగితం మీద పోగేసిన అక్షరాలన్నీ చెత్తతో సమానం కదా. భాష మీద సాధికారత, శిల్ప నైపుణ్యం సాంకేతిక లక్షణాలైతే, లోపలి కొలిమిలో జరిగే చర్య భావోద్వేగభరితం. దాని నుంచే కవిత్వానికి ఆత్మ సిద్ధిస్తుంది.
స్వేచ్ఛకు metaphorగా పక్షిని తీసుకోవడం కొత్తేమీ కాదు. చాలా మంది కవులు ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఓ చోట పక్షి-స్వేచ్ఛ-ఆకాశం అని రాసుకుని పలవరించినవారే. అదే పక్షి పంజరంలో ఉంటే అది నిర్బంధానికి ప్రతీక. ఈ పక్షులూ, పంజరాలూ, స్వేచ్ఛలూ అనగానే నాకు అజరామరమైన, I know why the caged bird sings పేరుతో నల్లజాతి అమెరికన్ కవి మాయా ఆంజిలో యాభై ఏళ్ళ కిందటే వినిపించిన ఆత్మగాథ గుర్తొస్తుంది. A free bird dares to claim the sky అని చెప్పిన మాయా, అదే వరసలో పంజరంలోని పక్షి గురించి ఏమన్నారో చూడండి:
But a bird that stalks
down his narrow cage
can seldom see through
his bars of rage
his wings are clipped and
his feet are tied
so he opens his throat to sing
రెక్కలు విరిచి, కాళ్ళు కట్టిపడేసిన పక్షి ఆ ఇరుకు పంజరంలోంచి ఏం చూడగలదు… ఏం చేయగలదు? అందుకే, అది గొంతు విప్పి పాడుతుంది. నల్లజాతి అణచివేతపై తిరగబడిన ఈ ఉద్యమ కవిత్వంలో మాయా ఆంజిలో ఆత్మిక వేదన అంతర్లయగా తారాడుతుంది. అందుకే, అది కేవలం ఒక తాత్పర్యంగా కాక ఒక అనుభవంగా పఠితను చేరుతుంది.
“సగం కవిత నువ్వు రాస్తే
రెండో సగం నే పూర్తి చేయాలి” అని శివారెడ్డి ఇదే సంకలనంలో మరో చోట అన్నప్పుడు… అర్థం చేసుకోవాల్సింది ఆ రెండో సగం లోపలికి ఒంపుకున్న అనుభవమేనని.
‘కొంచెం స్వేచ్ఛగావాలి’ కవిత కూడా ప్రతీకలు, పద చిత్రాలు పాతవైనా అందులోని వైయక్తికాంశ వల్ల ఒక కొత్త అనుభవంలా మనల్ని చేరుకుంటోంది. కవిత్వం స్వభావరీత్యా వైయక్తికమే. ప్రతి వ్యక్తీ unique అన్నట్లుగానే, ప్రతి ఒక్కరి అనుభవమూ ప్రత్యేకమైనదే. ఆ ప్రత్యేకతను ఆవిష్కరించేదే కవిత్వం. సామాజిక దృక్పథం అని చెప్పుకునేదేదైనా వ్యక్తి అంతః సంఘర్షణ నుంచి పుట్టినప్పుడే అది ఒక భావోద్వేగంగా transmit అవుతుంది. కవిత్వంలో గొప్ప ఆదర్శాలు, లక్ష్యాలు ఉండొచ్చు. కానీ, గొప్ప ఆదర్శాలను, లక్ష్యాలను వినిపించినంత మాత్రాన అది గొప్ప కవిత్వమయ్యే అవకాశం లేదు. అందుకే, నక్షత్రపురం తోవకు నాంది ప్రస్తావిస్తున్నప్పుడే అన్నాను, poetry first అని. సామాజిక విధ్వంసాన్ని విధ్వంసకరంగా ప్రశ్నించిన అమెరికన్ కవి Allen Ginsbergను నెత్తిన పెట్టుకునే వాళ్ళు కూడా ఆయన చెప్పిన ఈ మాటను ఎందుకు విస్మరిస్తారో అర్థం కాదు.
“Poetry is not an expression of the party line. It’s that time of night, lying in bed, thinking what you really thing, making private world public, that’s wat the poet does.” అని కదా Ginsberg చెప్పింది. వైయక్తిక ప్రపంచాన్ని వ్యక్తం చేయడం అంటున్నాడు… అర్థమవుతోందా?
ఈ రహస్యం తెలిసిన కవి శివారెడ్డి. ఈ నలభై యాభై ఏళ్ళలో ఆయనతో తిరిగినవారు, ఆయనతో ప్రేరణ పొందినవారు, ఆయన వెన్నుతడితే కవిత్వ రాసిన వారిలో చాలా మంది శివారెడ్డి గారిలోని ప్రాసంగిక శైలిని, narrative formatను, ఇంకా చెప్పాలంటే సాంద్రత లోపించిన వాచ్య సందర్భాల్ని కూడా తమ వశం చేసుకున్నారు. కానీ, ఆ రహస్యాన్ని మాత్రం అందుకోలేకపోయారు. దాన్ని చాలా కొద్ది మంది మాత్రమే పట్టుకోగలిగారు. ఆ పట్టుకున్న వారిలో కొందరు మరింత సాంద్రంగా రాటుదేలారు. Inspire అయినవాళ్ళు అలా కొత్త దారులు నిర్మించుకునే ప్రయత్నం చేస్తే, కేవలం influence అయిన వాళ్ళు నకళ్ళుగా తేలిపోయారు. యాభై ఏళ్ళుగా కవిత్వం రాస్తున్న వ్యక్తి తనకు తెలియకుండానే తన చుట్టూరా ఒక ప్రపంచాన్ని నిర్మిస్తారు. ఆ ప్రపంచంలోనూ మిగతా ప్రపంచంలో మాదిరిగానే సకల సాధారణ అవలక్షణాలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇదంతా చెప్పాల్సి వస్తోంది.
శివారెడ్డి గారితో నాకు 1988-90 ప్రాంతంలో పరిచయం. సిద్ధిపేటలో మంజీరా రచయితల సంఘం సమావేశానికి శివారెడ్డి గారు వస్తున్నారని, నందిని సిధారెడ్డి నాకు చెప్పడమే కాదు. కవిత్వం పట్ల నాకున్న ఆసక్తిని గమనించి మెదక్ నుంచి వెంట తీసుకుని వెళ్ళారు. అక్కడే గాలి నాసరరెడ్డిగారిని మొదటిసారి కలిశాను. కవిత్వంలో క్లుప్తత అంటే ఏమిటో ఆయన నుంచే నేర్చుకోవాలి. కవి గాయకుడిగా కొత్త కెరటంలా ఎగసిపడుతున్న యువ దేశపతి శ్రీనివాస్‌తో పరిచయమైందీ అప్పుడే. ఆ సందర్భానికి సంబంధించి చెరిగిపోని మరో మంచి జ్ఞాపకం నలిమెల భాస్కర్. సభ సాయంత్రమైతే, పగలంతా చాలా మంది కవిత్వ ప్రియులు ఇన్‌స్పెక్షన్ బంగళాలో శివారెడ్డిగారి చుట్టూ చేరి, ఆయన చెప్పేది వింటున్నారు. ఆయన కవితలు వినిపిస్తుంటే నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. “ధ్వంసం చేయతగిందేదీ లేకపోతే నీకీ లోకంలో/ నువ్వు తప్పకుండా ధ్వంసం చేయదగిన వ్యక్తివి” అన్న మాటలు ఆయనన నోటెంట విన్నది అప్పుడే.
అప్పటి నుంచీ ఆయన నన్నూ వెంటాడుతూనే ఉన్నాడు. ఆంధ్రా యూనివర్సిటీలో నేను లా చదువుతున్నప్పుడు, 90ల మొదట్లో, శివారెడ్డి గారు విశాఖ వస్తే నాకిష్టమైన వసీరా, శిఖామణిలతో కలసి హోటల్‌ గదికి పరుగు తీసేవాడ్ని. ఆయన కవిత్వాన్ని వినిపిస్తుంటే నేను ఇప్పటికీ మెస్మరైజ్ అయిపోతుంటాను. హైదరాబాద్ వచ్చి జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్న తరువాత ద్వారకలో ఆయనతో అనుబంధం పెరిగింది. ఆయన మనుషుల్ని ప్రేమించే మనిషి. ఒక మనిషి మరొకడితో ఎంత ప్రేమగా ఉండవచ్చో ఆయన చూసి తెలుసుకోవచ్చు. అంతెందుకు, ఈ మధ్య నాలుగైదు నెలల కిందట 2019సెప్టెంబర్‌లో, ఇదిగో ఇదే “కొంచెం స్వేచ్ఛగావాలి” సంకలనానికి సరస్వతి సమ్మాన్ పురస్కారం అందుకోవడానికి దిల్లీ వచ్చినప్పుడూ అదే ఆప్యాయత. కొంతమంది తెలుగు విద్యార్థులు ఆంధ్రాభవన్‌కు వచ్చి ఆయన చుట్టూ మూగారు. ఆ నవతరం అమ్మాయిలు, అబ్బాయిలతో శివారెడ్డి తన కవితలను చదివి వినిపిస్తుంటే అదే మెస్మరిజం. ‘ఎవరై వుంటారు / ఇంటి ముందు నుంచుని ఏడుస్తున్నారు/ ఎక్కిళ్ళు కూడా వినిపిస్తున్నాయి…’ అనే కవిత చదివి వినిపిస్తూ.. మనసులోకి ఒక భారాన్ని ఒంపారాయన. పది మందిలో ఉన్నప్పుడు ఆయన ఎంత ఉల్లాసంగా ఉంటారో చెప్పలేం. అలాంటి కవి ఏకాంతంలో ఎంత నిగూఢంగా ఉంటారో అనిపిస్తుంది. ఆయనకు ఎప్పుడూ మనుషులు కావాలి.
“ఎప్పుడూ
ఒక కుర్చీ వేసి అట్టిపెడతా
పొద్దున్నే టీ తాగే సమయానికి
ఎవరో ఒకరు రాకపోతారా అని”
అంటారు దేవులాట అనే కవితలో. ఆ తరువాత, ఎవరూ రాకపోయినా కుర్చీ ఉంటుంది కదా అనీ అంటారు. అంతేకాదు, ఖాళీ కుర్చీ ఎప్పుడూ ఖాళీగా వుండదు” అని పద్యాన్ని ముగించేస్తారు. ఎన్ని జీవితాలతో పెనవేసుకుంటే ఒక కవి జీవితమో కదా!
రక్తం సూర్యుడు (1973)తో మొదలై దాదాపు అర్థ శతాబ్ద కాలంగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ కవిత్వ జైత్రయాత్రలో పాతికకు పైగా సంపుటాలు వెలుగు చూశాయి. వాటన్నింటిలో నన్ను బాగా వెంటాడింది “మోహనా ఓ మోహనా”. ఆ తరువాత “నా కలలనది అంచున” సంపుటిలో నేను ఎన్నిసార్లు మునిగితేలానో నాకే తెలియదు. ఇప్పుడీ “కొంచెం స్వేచ్ఛగావాలి”ని దిల్లీకి వచ్చినప్పుడే చేతిలో పెట్టారు చేవ్రాలుతో. అప్పట్నుంచీ ఈ పుస్తకాన్ని చదువుతూనే ఉన్నాను.
ఇన్నేళ్ళుగా ఒక కవి కవిగా కొనసాగడం ఎలా సాధ్యం? కొనసాగడమే కాదు ఇంత విస్తృతంగా రాయడం ఎలా సాధ్యం? మరీ ముఖ్యంగా, ఎన్నో కఠిన, నిష్ఠుర సందర్భాల్ని దాటుకుంటూ గుండెలో తడిని, కళ్ళల్లో చెమ్మను కాపాడుకుంటూ అంతర్జనమై జీవిస్తూ ఉండడం ఎలా సాధ్యం? అందుకే, శివారెడ్డి అజేయం.
ఇది “కొంచెం స్వేచ్ఛగావాలి” సంపుటిపై నా విశ్లేషణ కాదు. ఈ పుస్తకం తెరవగానే నాలో మొదలై కొనసాగుతున్న ప్రయాణం. అలా అని సమీక్ష కూడా కాదు. ఒక కవితతో తలుపులు తెరిచి ఒక హృద్యమైన కవిత్వయాత్రకు పలుకుతున్న ఆత్మీయ ఆహ్వానం.
మచ్చుకు మరికొన్ని వాక్యాలు:
ఒంటరితనం ఎంతగా కిక్కిరిసిపోయింది (ఒంటరితనం)
ముగింపు గురించి భయమేల
ఎట్టా ముగిసినా ఆనందమే-
అన్ని ముగింపులకు సిద్ధమయ్యే కదా యింత దూరం వచ్చింది (ముగింపు గురించి);
పద్యం లోపలి పద్యం మరణించదు
… అన్ని పద్యాలూ ఒక పద్యంలో ఒదుగుతాయి (దారం కొస);
ఏముందిక్కడ
ప్రయాణం మొత్తం నువ్వు నువ్వుగావడమే (ఏదీ ఆగదు);
ఆకాశం పాముల్ని వర్షిస్తుంది
మరపుకీ, జ్ఞాపకానికీ మధ్య లింకు తెగుతుంది
రాతి దేవత ఒకతె ఊరి మధ్య నడుస్తూ పోతుంది (రాతి దేవత);
ఈ దేహాంతర నరక స్థితి
నీకెలా అందుతుంది
నువ్వొక దేహంతర నరకస్థితిలో వుంటే తప్ప (దేహాంతర);
ఎవరయి వుంటారు?
చెవులు చాలా స్పష్టంగా చూస్తున్నాయి ఏడ్పుని
…. నిద్రలోకి గూడా విన్పించే ఏడ్పు
లోలోపల తగలబడుతున్న అడవి
ఎవరో నిరంతరాయంగా ఏడుస్తున్నారు (ఇంటి ముందు నుంచొని);
ఒక్కడు లేకపోతే
యింత ఖాళీయా? (ఒక్కడు లేకపోతే);
మామూలుగా అయితే
ఎదురుగా నుంచున్న స్ప్రింగ్ డోర్‌కేమీ విలువలేదు
పెద్దగా గమనించాల్సిన అవసరమూ లేదు
కానీ, మిత్రుడొస్తానన్నాడు
ఎదురు చూస్తూ డోర్ కేసి చూస్తూ – నేను (మామూలుగా అయితే);
మంచు కురుస్తున్న
ఓ శీతాకాలం పొద్దుటిపూట
మరో కవితో సంభాషణ-
… మాటల్లో దొర్లుతున్న సజీవ చరిత్ర ద్వారా
‘కిలమానూర్ మధు’ న్యూమోనియా పద్యం
దేశమంగళం కర్ఫ్యూ మళ్లీ బతుకుతాయి
సీమస్ హీనీ, మెట్టా నాగేశ్వరరావు,
డా. ముత్యం సుబ్బారావు పాణిగ్రాహి – అన్నీ కలగలిసి
ఈ పొద్దుటిపూటలో కలిసి, కదిలిపోతాయి
గతానికి వర్తమానానికి ఒక సంభాషణ ఈ పొద్దుటిపూట
….ఇలాంటి పొద్దుటి పూట
ఎవరో పోకిరి పిల్లాడు ఒక రాయి విసురుతాడు
చెరువులో బుడుంగున మునిగి చక్రాలు చుడుతుంది
ఈ పొద్దుటిపూట మాట్లాడుతుంది
చిన్న నీటి పిట్ట వాక్యాన్ని నేస్తూ పోతుంది (నీటిపిట్టల వాక్యం);
ప్రేమతో తొణికిసలాడే వాక్యం గొప్పదని… జీవితాన్ని వాక్యమయం, పద్యమయం చేసుకున్న కవి శివారెడ్డి. ఈ సంకలనం ఇన్నేళ్ళ కవిత్వయానంలో ఆయన అనుభవాల సారాంశం. దీంట్లో ఇదమిత్థంగా వస్తువంటూ ఏమీ లేదు. కశ్మీర్ మీద కవిత రాశారా, సీఏఏ మీద ఏమైనా చేయి చేసుకున్నారా, కఠువా మీద కన్నీళ్ళెట్టుకున్నారా అని అడిగేవాళ్ళకు అర్థమవుతుందో లేదో కానీ, ఇందులో అన్నీ ఉన్నాయి.
‘పేజీ తిప్పినట్లు తెలవారుతున్న ప్రతి రోజు’లోకి వాక్యమై నడిచిపోతున్న కవి పాద ముద్రలివి.
***
©PasunuruSreedharBabu
Uncategorized

స్వేచ్ఛా గీతాన్ని మంత్రంలా మ్రోగించిన బాబ్ మార్లీ

“ఈ స్వేచ్ఛా గీతాల్ని
పాడడానికి నీవు సాయపడలేవా
నా దగ్గర ఉన్నవల్లా
విముక్తి గీతాలే
విముక్తి గీతాలే
ఈ స్వేచ్ఛా గీతాలే”
బాబ్ మార్లీ రాసిన ఈ Redemption Songను నిన్న గుర్తు చేశారు జర్నలిస్ట్, పౌర హక్కుల ఉద్యమకారుడూ అయిన గౌతమ్ నవలఖా నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఎదుట లొంగిపోవడానికి ముందు రాసిన బహిరంగ లేఖలో. దళిత మేధావి, రచయిత అయిన ఆనంద్ తేల్‌తుంబ్డే కూడా అదే రోజు లొంగిపోయారు. అంబేడ్కర్‌ మనుమరాలు ఆయన భార్య. అంబేడ్కర్ జయంతి రోజునే వారు Unlawful Activities (Prevention) Act (UAPA) కింద అరెస్టయ్యారు. భీమాకోరేగావ్ కేసులో అరెస్టుల పరంపర రెండేళ్ల నుంచీ కొనసాగుతోంది. తెలుగు కవి, విరసం నేత వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరేరా తదితరులు ఇప్పటికీ పుణెలోని యరవాడ జైలులో ఉన్నారు.
ఆనంద్ తేల్‌తుంబ్డే కూడా ఎన్ఐఏ ఎదుట లొంగిపోవడానికి ముందు ఈ దేశ ప్రజలను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేవారి మీద కూడా దేశద్రోహులనే ముద్ర వేసే గడ్డు రోజుల్లో ఈ పరిస్థితి ఎవరికైనా రావచ్చని ఆయన హెచ్చరించారు. “మీ వంతు రాక ముందే మీరు గొంతెత్తుతారని ఆశిస్తున్నా” అని ముగించారు.
ఇద్దరూ కోరింది ఒక్కటే విముక్తి గీతంతో గొంతు కలపమని. ఇక్కడ జమైకా గీతకారుడు బాబ్ మార్లీని తలచుకోవడంతో ఆ విషాద భారం ఒక్కసారిగా గొంతులో దిగబడినట్లయింది నాకు.
bob morley
ఎవరీ బాబ్ మార్లీ? నడుస్తున్న భారతానికీ ఆయన పాటకీ ఏమిటి సంబంధం? అది అణచివేతకూ, విముక్తి ఉద్యమానికీ ఉన్న సంబంధం. వివక్షకూ, నిరసనకూ ఉన్న సంబంధం. స్థలకాలాలకు అతీతమైన ఉద్విగ్న సంబంధం. మరీ ముఖ్యంగా గాయానికీ గీతానికీ ఉన్న అసంకల్పిత ప్రతీకార చర్యలాంటి బంధం.
Love the life you live. Live the life you love అంటూ జీవితాంతం కలల్ని వేటాడిన వేటగాడు. కటిక పేదరికం నుంచి గొంతెత్తి నిల్చుని యౌవనాన్ని పోరాట గీతానికి ధారపోసినవాడు. ఇక ఆ తరువాత జీవితం అక్కర్లేదన్నట్లుగా 36 ఏళ్ళకే తనువు చాలించి యోధుడిగానే గుర్తుండిపోయినవాడు. ఎంత సంపాదించావనన్నది కాదు, నీ చుట్టూ ఉన్నవాళ్ళను చైతన్యంతో ఎంత ఉత్తేజపరిచావన్నదే అసలైన గొప్పతనమని చాటింపు వేసి, పోరాడే హృదయాల్లో చాటింపుగా నిలిచిపోయినవాడు.
నాలుగు దశాబ్దాల కిందట (1981) శాశ్వతంగా మూగబోయన ఈ గొంతు… ఈరోజున ఖండాలు దాటి ఒక నిలువెత్తు ప్రశ్నలా నిలిచిన ఉత్తరంలో మార్మోగింది. ఆ ప్రకంపన ఎలా ఉంటుందో ఆ రాసిన వ్యక్తికి బాగా తెలుసు. కాబట్టే, ఆ నాలుగు వాక్యాలతో లేఖను ముగించాడు.
హాటెన్ టాట్, జూలూ, నీగ్రో
ఖండాంతర నానా జాతులు
చారిత్రక యధార్థ తత్వం
చాటిస్తారొక గొంతుకతో… అన్నాడుగా మహాకవి శ్రీశ్రీ. అచ్చంగా అలాంటి ఒక గొంతుక బాబ్ మార్లీ.
శ్రీశ్రీయే చెప్పినట్లు, ‘నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ/ నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని’ తపించినవాడు బాబ్ మార్లీ.
నల్లజాతిని బానిసలుగా చేసిన చరిత్రను ప్రశ్నిస్తూ, విముక్తి పోరాటాన్ని గానం చేస్తాడు బాబ్ మార్లీ ఈ Redemptions Songలో. ఒక్కొక్క పదాన్నీ గుండెలో అచ్చు గుద్దినట్లు దింపుతాడు. ఇదీ ఆ పాట పూర్తి పాఠం. ఈ పాటనూ, పాఠాన్నీ మళ్ళీ మళ్లీ విందాం. రేపు మన వంతు కూడా వచ్చే లోగా ఏం చేయాలో కొంతైనా తెల్సుకుందాం.
ఆ పాటలోని శక్తి అనువాదంలోకీ ఎలాగూ రాదు. అందుకు క్షమించండి. కాకపోతే, ఈ ప్రయత్నం మిమ్మల్నిఅతడి పాటల్ని అర్థం చేసుకుని పలవరించేందుకు ప్రేరేపిస్తే అంతే చాలు.
‘విముక్తి గీతం’
ప్రాచీన సముద్రపు దొంగలు
అడుగులేని అగాధంలోంచి
నన్ను పైకి లాగి, నిమిషాల్లో
నన్ను వర్తక నౌకల వాళ్ళకు అమ్మేశారు
కానీ, నా చేయి చాల గట్టిది
శక్తిమంతుడైన దేవుడి చేయి పట్టుకుని
మనం ఈ తరం దాకా ముందడుగు వేశాం
ఘన విజయంతో…
ఈ స్వేచ్ఛా గీతాలు పాడేందుకు
నీవు సాయం చేయవా?
ఎందుకంటే, నావద్ద ఉన్నవల్లా
విముక్తి గీతాలే
విముక్తి గీతాలే
నిన్ను నీవు మానసిక బానిసత్వం నుంచి విముక్తం చేసుకో
మన మనసులకు స్వేచ్ఛ ఇవ్వాల్సింది మనమే
అణుశక్తిని చూసి భయపడకు
అవేవీ కాలాన్ని ఆపలేవు
మనం అలా పక్కన నిలబడి చూస్తుంటే
ఎంతకాలం వాళ్ళు మన ప్రవక్తలను చంపుతూ పోతారు?
ఇదంతా మామూలే కదా అంటారు కొందరు
కానీ, మనం పుస్తకాన్ని నిండుగా రాసుకోవాలి
నీవు సాయం రావా
ఈ స్వేచ్ఛాగీతాల్ని పాడడానికి?
నా వద్ద ఉన్నవల్లా
విముక్తి గీతాలే
విముక్తి గీతాలే
విముక్తి గీతాలే
నా వద్ద ఉన్నవి
విముక్తి గీతాలే
ఈ స్వేచ్ఛా గీతాలే
స్వేచ్ఛా గీతాలే.
క్యాన్సర్ రూపంలో మృత్యువు తరిమేస్తుందని తెలిసీ పాటల్తో రోజుల్ని లెక్కించుకుంటున్న 1980లో ఈ పాటను రచించి, గానం చేశాడు మార్లీ. ఈ గీతం అతడు సృజించిన అద్బుత గీతాల్లో అత్యుత్తమైందని అంటారు. వివక్ష మీద సాగుతున్న చిరకాల పోరాటాలకు ఇదొక ప్రతిజ్ఞాగీతం లాంటిదని అంటారు. కేవలం అకాస్టిక్ గిటార్ మాత్రమే వాయిస్తూ ఈ పాట పాడతాడు మార్లే. బానిస జీవితాల నుంచి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నినదించిన విముక్తి విశ్వాసాల మీదుగా ఈ పాటను మోగిస్తాడు.
Get up, Stand up, Stir it up, Buffalo soldier, Is this love, Sun is shining వంటి గొప్ప పాటలెన్నో ఆయన గళం నుంచి వినాల్సిందే. ఆయన పాడినవన్నీ మరణం లేని చరణాలే.
I want to love you
I want to love you, and treat you right
I want you love you, every day and every night. అంటాడు ఎంతో సింపుల్‌గా Is this love పాటలో. Treat you right అన్నది ఇప్పటికీ ఒక తీరని కల కావడమే విషాదం. కాబట్టి…
Get up, stand up
Stand up for your rights
Get up, stand up
Don’t give up the fight
అంటున్నాడు.
యూట్యూబ్‌లో Bob Marley అని కొడితే చాలు వెల్లువలా వచ్చి పడతాయి అతడి పాటలు. అవి తెల్లవారుజామున తుపాను వర్షంలా ముంచెత్తే పాటలు. ఆ పాటల్లో కేవలం తడిసిపోకండి. వాటిని అనుభవించండి.
Some people feel the rain.
Others just get wet. – Bob Marley
***
Uncategorized

ఒక అత్యాధునికుడి ఆదిమ తపన… శ్రీకాంత్

srikant
In you the wars and the flights accumulated.
From you the wings of the song birds rose.
You swallowed everything, like distance,
Like the sea, like time. In you everything sank!
అని నెరూడా లాగా అనగలడు. కానీ,
It is the hour of departure, oh deserted one అంటో Song of despair లేమీ ఆలాపించడు.
అలాగని విచారమేమీ లేదని కాదు. ఉన్నదంతా విచారమే. దిగులే. కోల్పోవడం గురించి కాదు. పొందుతున్నవేదన. పొగిలి పోతున్న దుఃఖం. ‘గుండెలో ఒక కందిలి పగిలి’ వేడి గాజు పెంకులు గుచ్చుకుని రక్తమోడుతున్న హింస.
రాయాలని కూర్చొంటే, తెల్లటి తడితో కళ్ళలోంచి రాలుతున్నాయి నల్లటి పదాలై ఈ పై అక్షరాలు
కొంత ధూళై కొంత దూరమై
కొంత నెత్తురై కొంత శాపమై
నేను ఎప్పటికీ తిరిగి తాకలేని ఒక మహా కాంతి లోకమై… అంటాడు. “మృగాలు సంచరించే చదరపు గదుల హృదయాల” మధ్యకు ఎదుగుతున్న పూవుల్లాంటి బిడ్డల్లాంటి మహా కాంతిలోకాలకు దూరం దూరమవుతూన్న దగ్ధత్వంతో.
Leaning into the afternoons I cast my sad nets
towards your oceanic eyes.
There in the highest blaze my solitude lengthens and flames,
its arms turning like a drowning man’s అంటూ ప్రేమలో సముద్ర నేత్రాల్లోకి విషాదాల వలల్ని విసిరి సమున్నత జ్వాలల్లో సుదీర్ఘ ఏకాంతంలా కాలిపోతూ మునిగిపోతూ చేతులెత్తి మొక్కుతూనే ఉంటాడేమో ప్రేమంత్రనగరికి అరుదైన అతిథిలా వచ్చి వెళ్ళిపోయిన నెరూడాలానే మళ్ళీ. తప్పదు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నప్పుడు అప్పుడప్పుడే మెరిసి నా ఆత్మలా మిణుకు మిణుకు మంటున్న తొలి నక్షత్రాలను చీకటి పక్షులు ముక్కుతో గిల్లుతుంటాయి కదా.
The birds of night peck at the first stars
that flash like my soul when I love you. (Leaning into the afternoons)
అవును కదా. ఆత్మల్ని వెలిగించే జ్యోతులు కదా స్త్రీలు.
అందుకే అంటాడు శ్రీకాంత్:
నన్ను నిర్వచించే నన్ను రచించే
నాకు మిగిలిన ఒకే ఒక జననం
అని పిలువనా నిన్ను?
నాకు మిగిలిన ఒకే ఒక మృత్యువు
అని పిలవనా నిన్ను.
నాకున్న ఒకే ఒక సత్యం
అని పిలువనా నిన్ను.
స్త్రీకి దేహమే కాదు. హృదయం ఉంది. ఆలోచన ఉంది అని గుర్తు చేయడానికి వేల ఏళ్ళ పుక్కిటి పురాణాల అరణ్యాల తరువాత, తేనెలు పూసిన ప్రబంధాల గాయాల తరువాత చలం లాంటి విధ్వంసకుడొకడు పుట్టాల్సి వచ్చింది. అయినా బీటలు పడ్డాయి కానీ గోడలింకా కూలనే లేదు. అలాంటి చోట “అనేక డిస్కోర్సుల వాచక కర్మాగారాలలోంచి, వివిధ ప్రతీకలలోంచి, వివిధ చిహ్నాలలోంచీ వివిధ ప్రతిరూపాలలోంచీ స్త్రీకి ఆపాదించబడిన ప్రత్యేక లక్షణాలలోంచి స్త్రీని విడదీసి స్త్రీని చూడటం ఎలా?” అని అడుగుతున్నాడు ఈ కవి. “When we say woman, do we have a possibility to reach women, as such?” అని తనను తానే ప్రశ్నించుకుంటున్నాడు. స్త్రీకి దరి చేరే దారులను వెతుక్కుంటున్నాడు. Cliched images నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న స్త్రీలకు పురుష వాచకాలతో తోరణం కడుతున్నాడు.
నీళ్ళని చీల్చే పాదాలూ, ఎదురీదీ నిర్మలంగా వెళ్ళే కళ్ళూ నీవి
అలా ఎదురు చూడకు
దీపం అంటిన చీకటి
మెరుస్తోంది ఇక్కడ. నీ వద్దకు రాలేని ఈ గోడలపై నిలువెత్తు
నీడలై నేనై –
అందుకే ఆ వెంటనే పశ్చాత్తప్తుడై అంటున్నాడిలా:
చర్మాన్ని వొలిచి, వెలుపలికి మలిచి
బల్లపై ఒక కూజా వలె, ఒక పూల పాత్ర వలె ఉంచి వినమ్రతగా
తప్పుకోగలను: ఊయలలూపే నీ చేతులు
క్షణకాలం ఆగిన చోట నుంచి –
ఇక్కడ నాకు సదా బాలకుడు ఇస్మాయిల్ గుర్తుకు వస్తున్నాడు.
“నీ బాహువుల్లో నన్ను బంధించి
నా దేహానికి కొత్త ద్వారాలు తెరుస్తావు!
నీ వ్రేళ్ళ మంటల్తో నన్ను కాల్చేసి
నా దేహానికి క్రొత్త చర్మం తొడుగుతావు.
ఇస్మాయిల్ కవితలోనూ స్త్రీని ఉన్నతంగా, మహిమాన్వితంగా చూపినప్పటికీ అది వైయక్తికం. శ్రీకాంత్ స్త్రీ ప్రేమను taken for granted గా తీసుకోకపోవడమే కాకుండా, ప్రేమానుభవ సాంద్రతను గాఢంగా గ్రహించడమే కాకుండా, ‘ఆమె’ను conscious గా చారిత్రక, సామాజిక నేపథ్యంలోంచి దర్శిస్తూ, guilt నీ వ్యక్తం చేస్తున్నాడు.
Familistic hegemony నుంచి, Ideological constructs నుంచి, సంకెళ్ళ వంటి మెటఫర్ల నుంచి, దేహం చుట్టూ అల్లిన రాజకీయాల ముళ్ళ కంచెల నుంచి బయటపడడానికి పోరాడుతున్న స్త్రీని ప్రేమిస్తున్నాడు. ఆమె పోరాటాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ కవితల పుస్తకంలోకి తెలుపు తెరుస్తూనే…
ఏమీ కానీ స్త్రీలు, ఏమీ మిగుల్చుకోని స్త్రీలు… ఎందుకో కానీ ప్రేమిస్తారు… అంటూ తప్త గీతాన్ని ఆలపిస్తాడు శ్రీకాంత్.
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
ప్రేమ అనుకుని, ప్రేమను అందుకుందామని
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
…..
అద్దాలలోంచి మన ముఖాల్ని లాగడానికీ
ముఖాల్లోంచి అద్దాలను తీసివేయడానికీ, మన హృదయాలను భక్షించి
తమ హృదయాలను శిక్షించుకుని, చిందరవందర అయ్యేందుకూ
ఉక్కిరి బిక్కిరి చేసేందుకూ
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు….
వచనంగా ఒక్కోసారి వాచ్యంగానూ భ్రమింప చేసే ఈ సాదా సీదా వాక్యాల అంతర్లయలో ప్రచ్ఛన్నంగా ధ్వనించే ఒక విరోధాభాస, ఆలోచన కన్నా ముందే గుండెను కుదిపేసే గాఢత మనల్ని వెంటాడుతుంది. పునరుక్తిని ఒక నిర్మాణ వ్యూహంగా సంధిస్తూ అద్భుతంగా ఈ పద్యాన్ని నడిపిస్తాడు శ్రీకాంత్.
ఇలా ఈ పుస్తకంలో స్త్రీల గురించి, gender sensibilities గురించి, స్త్రీ పురుషుల ప్రేమల గురించి, స్త్రీల బహు రూపాల గురించి రాసిన కవితలు dominant గా కనిపిస్తాయి. ఒక్కోసారి ఒకే కవితలో స్త్రీలను వారి విభిన్న రూపాలలో ప్రేమిస్తున్న complexity ద్యోతకమవుతుంది.
నిన్ను చదువుదామని అనుకుంటాను ఎలాగో ఒకలా. ..
తెలుసు నేనొక నిస్సహాయుడిని. పదాలనే హత్తుకుని ఆఖరి నెత్తురు చుక్క వరకూ నీ వద్దకు పారాడే ఒక శరణార్థిననీ…
నిన్ను చదువుదామని అనుకుని, రాత్రిని ఒక మంట చేసి వెలిగిస్తే, శరీరం అంటుకుని కాలుతుంది తెల్లటి పరదాలలో నిన్నిక చదవద్ద్దో చదవద్దో అంటో, నీడల్ని ఆర్పే వేకువ కాంతై, వేకువ కాంతిని ఆర్పే పొగమంచై, తెల్లగా, ఇక నుదిటిపై అరచేయంత చల్లగా, తల్లి దీవెనలాగ, ఇలాగ, నీలాగ. (ఇలాగ).
తనువంతా చిట్లిన అమ్మ
తనువే లేకుండా మిగిలిపోయిన చిట్టి అమ్మ – అటువంటి అమ్మని
రాత్రి తనువుని పెనవేసుకుని
అటువైపుకు తిరిగి నిదురోయే అమ్మని, ఎందుకైనా ఎవరైనా ఎలా కదపటం? (అమ్మ)
ఇంకా, “మన అమ్మలు, నువ్వు లేక, వంట చేసిన ఆ అరచేతులు, ఒక అమ్మ, అమ్మ చెప్పిన కథ, అమ్మ కళ్ళు, తను, నీలాంటి చీకటి, అమ్మలే, అమ్మీ, మా చిన్ని అమ్మ, నీ హృదయం…” ఇలా శ్రీకాంత్ కవిత్వావరణంలో స్త్రీలు రకరకాల రూపాల్లో కనిపిస్తారు. మనకు తెలిసీ తెలిసీ గుర్తించని, గ్రహించని రూపాల్లో, మన sub-conscious biased natureతో గడ్డ కట్టుకుపోయిన prejudicesతో చీకటిలో చూడలేక పోతున్న స్త్రీమూర్తుల గాథలను ఈ కవి మనకు వినిపిస్తాడు.
ఒక paragraphicలో ‘ఆమె’ వైపు నుంచి narration వినిపిస్తూ, “మీ మగవాళ్ళకెందుకు ఎప్పుడూ అదే యావ కాసింత సేపు మాట్లాడలేరా ప్రేమగా” అని తిట్టిస్తాడు. ఆ మాట ఎప్పుడంటుంది తను: “ఇక తను మోహంతో నిను గాట్టిగా చుట్టుకుని వదలకుండా పెనవేసుకొన్న సంగతి అంటావా కొండ చెలువల కౌగిలి నెమలీకలతో సమానం: మురుగా ఇక తరువాత ఏమిటీ అంటే చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు… ఇంతా చేసి ఆనక తీరికగా అంటుంది.
ఇళ్లకు మగవాళ్లు సమయానికి ఎందుకు రారోనని ఆనక తినీ తినక కడుపులోకి ముడుచుకుని పడుకున్న ఆమె ముంగిట్లోకి తూలుతూ చేసుకున్న ఓ Confession ‘ఒక సాధారణ వాచకం’:
విరిగి విరిగి నిదుర లేక తిరిగి లేచి, నన్నే
ఈ స్మశానాన్నే శుభ్రం చేసి
నా తల వద్ద ఒక ప్రమిదె వెలిగించినదీ నీవే.
శ్రీకాంత్ తను దేశ దిమ్మరిని, దేహదిమ్మరిని, భాషా దిమ్మరిననీ అని చెప్పుకుంటాడు ఇంతకు ముందు 2002లో ప్రచురించిన “యితర” కవిత్వ సంపుటిలో. యితరుడిలోంచి యితరుడిలోకి గాయాన్ని మోస్తున్న పాటలా సంచరిస్తాడు ఆ కవిత్వంలో. దాన్ని తొంభై తొమ్మిది శోకాల శ్లోక గీతం అన్నాడు వేగుంట ‘మో’హన ప్రసాద్.
అంతకు రెండేళ్ల ముందు “కొన్ని సమయాలు” అంటూ మొదటి పుస్తకం వేశాడు. ‘ప్రేమించేదారిలో మనుషులు ఒంటరి వాళ్ళవుతారు… గాయపడతారు. ఈ దేహం ఇక సహకరించకపోవచ్చు కవిత్వంలో కవిత్వం లేనంతగా.’ అంటూ తెలుగు కవిత్వంలోకి తనదైన డిక్షన్‌తో వచ్చాడు. Content విషయంలో కొత్తదంతో పాటు formలో తనదైన సంతకాన్ని – దేహాన్ని ఉలితో చెక్కుకుంటున్న గాయాలతో చిప్పిల్లిన రక్తంతోనే చేశాడు.
యితరకు వచ్చేటప్పటికి experimentalist లాగా తను లక్ష్యిస్తున్న రూపం ఇదీ అని చెప్పగలిగాడు. అయితే, అతడి కవిత్వ పర్యావరణం ఇప్పటికీ స్థూలంగా అలాగే ఉంది. అందులోనే కొత్త ఉద్యానాలూ, తుపానులూ, ఉత్పాతాలూ కొత్త రూపాల్లో సాక్షాత్కరిస్తున్నాయి మరింత matured planeలో మరింత లోతుగా, మరింత సన్నిహితంగా ఈ కొత్త సంకలనంలో.
ఈ కవితా సంకలనం పేరు ‘శ్రీకాంత్’. Does this text, does this body, does this textual body carry the name Srikant? అని అడుగుతాడు శ్రీకాంత్ ఈ పుస్తకం చివరి పేజీలలో ముద్రించిన 2013లో సారంగ కోసం అఫ్సర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఏమైనా శరీర వాచకం, వాచక శరీరాలు రెండింటికీ కలిపి ఉన్న ఏకైక భౌతిక గుర్తింపు “శ్రీకాంత్”యే కాబట్టి, ఆ పేరే టార్కోవస్కీ నలుపు-తెలుపుల నాస్టాల్జియా నిశ్చల చిత్రంతో టైటిల్‌గా సెటిలై పోయిందనుకుందాం. ‘కవిత్వం నాకు ఒక గూడు’ అనే శీర్షికతో సాగిన ఈ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ తనను తాను కోల్పోయి ‘రాతలో శరణార్థి’గా ఉన్నానని చెప్పుకుంటాడు. ఇదొక prologue లాంటిది. అతడి కవిత్వంలోకి open అవడానికి ఇది ఒక తాళం చెవిలా పనికొస్తుంది)
‘వాచక విముక్తం లేక, వినిర్మాణం కాలేక శరీరమంత తోలుమందం వాక్యాల పునరుక్తమై…” అంటూ అలమటిస్తున్నాడు శ్రీకాంత్ ఈ కొత్త కవిత్వంలో ఇంకా భాషతో పేచీ ఒక కొలిక్కి రాక.
ఇది ఇంకా కొనసాగే యుద్ధమే. కానీ, ఈ అభిమన్యుడు ఇప్పటికే చాలా దూరాన్నే ఛేదించాడు. ‘కృష్ణబిలాల’ మాయలన్నీ ధ్వంసం చేసే పనిలోనూ ఉన్నాడు. పదాలు పాతవే, పద చిత్రాలు కొత్తవి. వాటితో కొత్త రంగుల్ని, అర్థాల్ని ఆవిష్కరించే collage చేస్తున్నాడు కవిత్వంలో. అంతకన్నా వినిర్మాణం ఏముంది?
“నేను నవ్వి, నేను ఏడ్చి, నేను పగిలి, పిగిలి ‘నేను’ లేకుండాపోయి, ఇదిగో వచ్చి ఇల్లా రాస్తున్నాను ఈ అమృత క్షుద్ర పదాలని, ఒక మార్మిక ఆదిమ తపనతో. ఒక తొలి మలి రహస్య దాహంతో.”
సిగ్గుతో చితికిన గుజరాత్ గాయం లాంటి దేశంలో, “పురుషాంగమే ఒక దేశమైన, దేశమంటేనే పురుషావయవమైన ఒక కాలంగా… ఈ ఒక్క పూటకి ఇలా నేను: నన్ను నన్నుగానే ఉంచు” అని, Don’t you know that I aint a metaphor అని ఖాండ్రించిన తెంపరితనమూ ఉంది ఈ క్షుద్ర పదాలలో అమృతంతో పాటు.
ఇంకా పిల్లల గురించి రాసిన కవితలు కొన్ని తాదాత్మ్యం కలిగిస్తాయి. నిదురలో ఏదో కలవరించి లేచిన మూడడుగుల మల్లెపూవు లాంటి బిడ్డ వచ్చి నిద్ర లేపితే, ‘తెల్ల గులాబీ మొగ్గల వంటి ఆ కళ్ళనీ / ఇలా చూసుకుంటూ, ఇక ఈ రాత్రి / నువ్వైనా నేనైనా ఎలా నిదురోగలం? అంటాడొక చోట.
“నిండుగా పారే ఆ పిల్లల నిదురలోకి నువ్వు నీ ఆత్మనీ, శరీరాన్నీ కోల్పోయిన వేళ? ఏమైనా జరగనీ, ఏమైనా కానీ, కానీ ఒకరినొకరు గట్టిగా పెనవేసుకొని నిదురించే పిల్లలనీ, వాళ్ళ కాలాన్నీ కలలోనైనా కదిలించకు. ఊహామాత్రంగానైనా పిలవకు. ఎందుకంటే నీ పునర్జన్మ నీ ముందే రూపుదిద్దుకునే సరైన ఇంద్రజాల సమయం జనిస్తోంది ఇప్పుడే, ఇక్కడే, అందుకే! (పిల్లల నిద్ర)
“ఏం చేయాలో తెలియదు నీకు, పిల్లలు నిన్ను పట్టుకుని బావురుమన్నప్పుడు –
ఎంత మిట్ట మధ్యాహ్నం అయినా, నీ లోపలి ఆవరణలో కురుస్తుందో నల్లని మంచు.
….. చూడండి నిజంగా తెలియదు నాకు. ఏం చేయాలో, పిల్లలు అలా నన్ను వాటేసుకుని బావురుమని ఏడ్చినప్పుడూ, వెక్కిళ్ళతో అలా తినకుండా నిదురోయినప్పుడూ. మరి అప్పుడు, అక్కడ వాలిన పూలను చూస్తూ చేయాలో, మీకేమైనా తెలుసా ఇంతకూ?” (పిల్లలు నిన్ను పట్టుకుని ఏడ్చినపుడు)
అంతేకాదు,
“అయిపోయాం పెద్దరికంతో పేదవాళ్ళం ఎపుడో
ఇక చిన్నారుల తోటలోకి అడుగు పెట్టడం ఎలా?అని దిగులుపడుతున్నాడు. సంపదనంతా కోల్పోతూ మనం ఏ
దారిద్ర్యంలోకి పెరుగుతున్నామో కూడా చెబుతాడు.
“ఇంధ్రధనుసులు తెలియని
ఏక రంగోన్మాదులు వాళ్ళు
నా పిడికెడు స్థలంలో వామనుడి పాదాలతో వాళ్ళు (పిడికెడు)
…..
ఇది జీవితం. ఊరుకో హత్యలకు గురి కాకుండా కలలతో మిగిలిన మనిషి ఎవరూ లేరిక్కడ (కథలు చెప్పే మనిషి)
ఇట్లా ఈ కవిత్వం… ప్రేమలు, ఆత్మలు, దేహాలు, దేహ రాజకీయాలు, దేశ రాజకీయాలు, ముఖపుస్తకాలు నక్షత్ర ప్రసారాలు మాత్రమే తెలిసిన ఇరుకు చూపులు, మనుషులు లేని అంతర్జాలాలు, కాగి కాగీ చిక్కగా మరుగుతున్న Subaltern దుఃఖాలలో దేశ/హ దిమ్మరిలా తిరుగుతోంది.
అయినా ఏ దేహమూ మిగుల్చుకోలేదు, ఏ పదాలూ దాచుకోలేదు (యితర) అంటాడు శ్రీకాంత్. కవి తాను పదను పెట్టి, రాటు దేల్చిన పదాలతో కొత్త భాషను సృష్టించుకుంటాడు. ఆ భాష ఒక వాచకంలా (ఈ paragrahical/ prose poetryని, అవ్యాకరణ వాక్య సమూహాల్నిశ్రీకాంత్ కవిత్వమనేమీ చెప్పడం లేదు. Text అనే అంటున్నాడు) వెలిగిపోయి, ఒక ప్రశ్నలా నిలబడితే అంతకన్నా గొప్ప కవిత్వమేముంది.
ఇంతకీ ఆ ప్రశ్న స్థూలంగా:
“గీతకు ఇవతలా, గీతకు అవతలా సరే. కానీ, గీత గీసింది ఎవరు? గీతను కాపాడుతున్నది ఎవరు?”
ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. ‘భూమి పైకి ఒంగి పరిహసిస్తున్న కాళరాత్రి’ కింద నడుస్తున్న …
బాటసారీ దేహధారీ
వెలిగించుకున్నావా ఒక దీపం?
అట్టే పెట్టుకో మరి నిన్ను నువ్వు
ఆ రెండు అరచేతుల మధ్య-
ఇక ఆరిపోనివ్వకు
నీ హృదయాన్ని.
***
అనువాదాలు, Uncategorized

శ్వాస ఒక్కటే

rumi pic

నేను క్రైస్తవుడిని కాదు.
యూదు లేదా ముస్లింనూ కాదు.
హిందువును కాదు, బౌద్దుడినీ కాదు, 
సూఫీని కాదు జెన్‌నీ కాదు, అసలు
నాకే మతమూ లేదు

ఏ సంస్కృతీ సాంప్రదాయిక చట్రమూ
నా చుట్టూ లేదు
నేను తూర్పు నుంచి రాలేదు
పశ్చిమం నుంచీ రాలేదు
నేల మీంచో సముద్రం లోంచో రాలేదు

సహజంగానో అసహజంగానో ఊడి పడలేదు,
ఏ మూలకాల సంయోజనాన్నీ కాదు.
అసలు ‘నేను’ లేను

ఈ లోకంలోనో
మరో లోకంలోనో
నా మనుగడ లేదు
ఆదాము, ఈవ్‌ల వారసుడ్ని
అసలే కాను.

నాకే మూల కథ లేదు.
నాకే ఊరు లేదు, నా ఆచూకీకి
అనవాలు లేదు
దేహమూ లేదు, ఆత్మా లేదు.

నేనంతా నా దేవుడే
నేను రెండు ప్రపంచాలనీ
నేను ఒకటిగా చూశాను,
కోరుకోవల్సిందీ,
తెలుసుకోవల్సింది అదే.

ఆదిలో అంతంలో
లోపలా, బయటా
ఉన్నదొకటే శ్వాస
మనిషి శ్వాసిస్తున్న శ్వాస.

– జలాలుద్దీన్ రూమీ (Only Breath)
అనువాదం: పసునూరు శ్రీధర్‌బాబు